నిమజ్జనం: శ్రీకాకుళం వివాహితపై అత్యాచారయత్నం
మియాపూర్: శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి చెందిన ఓ వివాహిత ఎనిమిదో తేదీన జరిగిన గణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు ఏడో తేదీన గచ్చిబౌలిలో ఉంటున్న అక్క ఇంటికి వచ్చింది. అక్కా బావతో కలిసి ఆమె బుధవారం సాయంత్రం శిల్పారామం వెళ్లింది. రాత్రి పది గంటలకు వారు బయటకు వచ్చి ఆటో ఎక్కారు. కొత్తగూడ చౌరస్తా నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాల్సిన ఆటోను డ్రైవర్ హైటెక్స్ ముందు నుంచి న్యూ హఫీజ్ పేట వైపు మళ్లించాడు. దీనిపై వారు ప్రశ్నించగా "ఇది దగ్గర దారి" అని చెప్పాడు.
ఆటోడ్రైవర్ కాసేపటికి స్నేహితులకు ఫోన్ చేయడంతో వీరంతా మరో ఆటోలో న్యూహఫీజ్ పేట వద్దకు వచ్చి ఈ ఆటోలో ఎక్కారు. అప్పటికే వారు మద్యం తాగి ఉన్నారు. మధ్యలో వివాహిత కూర్చోగా ఒకవైపు అక్క, మరో వైపు బావ కుర్చున్నారు. ఆటోలో ఎక్కిన ముగ్గురు దుండగులు ఆమె అక్క, బావలను క్రిందకు తోసేశారు. త్రవాత ఆటోను మార్తాండనగర్లో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేయడానికి యత్నించగా వారిని తోసేసి తప్పించుకుంది.
ఇంతలో ఆటో నుంచి క్రిందకు పడిపోయిన ఆమె అక్క బావ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే 100కు పోన్ చేశారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మార్తాండనగర్కు రాగా ఆమె నడుచుకుంటూ వస్తోంది. ఆమెను విచారించిన పోలీసులు ఈ ప్రాంతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని అక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు.
బాధితులు అక్కడికి వెళ్లగా మార్తాండనగర్ తమ పరిధిలోది కాదని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి పంపేశారు. బాధితురాలి నంబర్ సేకరించిన మియాపూర్ పోలీసులు అంజయ్యనగర్ వెళ్లి విచారించారు. అనంతరం కొంతమంది ఆటో డ్రైవర్లను పలిపించి పరేడ్ నిర్వహించగా ముగ్గురు నిందితులను ఆమె గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకోని విచారించగా.. అసలు ఆటో డ్రైవర్ పేరు బయటకు వచ్చింది. వీరందరిని పోలీసులు అరెస్టు చేశారు.