రెండో భార్య వేధిస్తోందని: ఆటోను దగ్ధం చేసిన డ్రైవర్
విజయవాడ: తనను రెండో భార్య వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను తానే కాల్చేసుకున్న సంఘటన విజయవాడలో జరిగింది. తన భార్య పైన ఫిర్యాదు చేసినా పోలీసులు తీసుకోవడం లేదని ఆయన పోలీసు కమిషనరేట్ ముందే తన ఆటోను దగ్ధం చేయడం గమనార్హం.
జిల్లాలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్ ధర్నా చేశాడు. భార్య తనపై కేసు పెట్టిందని ఆయన చెప్పారు. పోలీసులు తాను చెప్పేది వినడం లేదని, తన ఫిర్యాదును తీసుకోవడం లేదని ఆటో డ్రైవర్ ఆరోపించాడు. పోలీసులు ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
పలు రైళ్లలో చోరీ
ప్రకాశం జిల్లా నుంచి వస్తున్న పలు రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. టంగుటూరు - సూరారెడ్డిపాలెం స్టేషన్ల మధ్య సిగ్నల్ను బ్రేక్ చేసి హౌరా ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్ రైళ్లలోకి దొంగలు చొరబడ్డారు. చెన్నై రైలులో దోపిడీలు చేసిన దొంగలపై రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో దొంగలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం తప్పించుకొని పారిపోయారు.
జింక వేటగాళ్ల అరెస్టు
జింకను వేటాడి చంపిన ఇద్దరు వేటగాళ్లను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అటవీ అధికారులు అరెస్టు చేసిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, బవన్నపాలెం సమీప అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
అడవిలో జంతువులను వేటాడుతున్నట్లు సమాచారం అందుకున్న సత్తుపల్లి అటవీ అధికారి నాగసాయి ప్రసాద్ సిబ్బందితో దాడిచేసి ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ ఖరీదైన తుపాకీ, స్కార్పియో వాహనం, మృతి చెందిన జింకను స్వాధీనపర్చుకున్నారు.
కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన చిట్టిబాబు, బవన్నపాలెం గ్రామానికి చెందిన పి శ్రీనివాసరావు స్కార్పియో వాహనంలో అడవిలోకి వెళ్ళి తుపాకితో జింకను వేటాడి చంపారు. మరికొన్ని అడవి జంతువులను వేటాడుతుండగానే అటవీ సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మృతి చెందిన జింకతో పాటు వేటగాళ్ళను అదుపులోకి తీసుకొని రాత్రికి రాత్రే సత్తుపల్లికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.