తేలని ఆళ్లగడ్డ పంచాయతీ: అఖిల, ఏవీకి చంద్రబాబు హెచ్చరిక, రేపు మరోసారి భేటీ
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు చేరిన ఆళ్లగడ్డ పంచాయతీ ఎటూ తేలలేదు. తాను చేపట్టిన సైకిల్ ర్యాలీపై మంత్రి భూమా అఖిలప్రియ వర్గం రాళ్ల దాడి చేసిందని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
అఖిలకు అహంకారం, 'భూమా'తో సంబంధాలు తెగిపోయాయి: ఏవీ సుబ్బారెడ్డి
అయితే, ఏవీ వర్గీయులు ర్యాలీ సందర్భంగా అఖిలప్రియకు వ్యతిరేకంగా అసభ్య నినాదాలు చేశారని భూమా వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వద్దకు ఆళ్లగడ్డ పంచాయతీ చేరింది. బుధవారమే ఏవీ సుబ్బారెడ్డి పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అమరావతి వచ్చినప్పటికీ.. అఖిలప్రియ హాజరుకాకపోవడంతో చంద్రబాబు సమావేశం గురువారానికి వాయిదా పడింది.
బాబు వద్దకు ఏవీ, అఖిలప్రియ
ఈ క్రమంలో గురువారం చంద్రబాబు నివాసానికి ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ చేరుకున్నారు. అఖిలప్రియతోపాటు ఆమె సోదరి మౌనికా రెడ్డి, బ్రహ్మానందరెడ్డి కూడా వచ్చారు. అఖిలప్రియ ఫ్యామిలీని టీడీపీ నేత వర్ల రామయ్య చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు.
సయోధ్య కుదిర్చేందుకు బాబు
చంద్రబాబు నాయుడు ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియలతో విడివిడిగా సమావేశమై వివాదంపై చర్చించారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయితే, పంచాయతీ తేలకపోవడంతో శుక్రవారం మరోసారి సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఏవీపై అఖిలప్రియ అసంతృప్తి
కాగా, ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి పోటీ రాజకీయం చేయడంపై అఖిలప్రియ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను మంత్రిగా ఉన్నప్పటికీ ఏవీ సుబ్బారెడ్డి వేరుగా కార్యక్రమాలపై నిర్వహించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అఖిలపై ఏవీ మండిపాటు
తాను పార్టీ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తే రాళ్ల దాడులు చేయడం ఏంటని మంత్రి అఖిలపై ఏవీ సుబ్బారెడ్డి మండిపడినట్లు తెలిసింది. అయితే, పార్టీ ఆదేశాల మేరకు తాను నడుచుకునేందుకు తాను సిద్ధమని ఆయన తెలిపినట్లు సమాచారం.
ఏవీ, అఖిలప్రియలకు బాబు వార్నింగ్
టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు వీరికి సూచించారు. పార్టీ కోసం పనిచేయాలని, వ్యక్తిగత వివాదాలకు వెళ్లొద్దని అన్నారు. ఇద్దరి పరిస్థితి బాగోలేదంటూ అఖిల, ఏవీ సుబ్బారెడ్డిలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉండగా, చింతలపూడి పంచాయతీ కూడా చంద్రబాబుకు ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు కలిసి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు వీరికి సూచించారు.