'భూమా' కేడర్ ఎక్కడిది: అఖిలప్రియ-మౌనికలకు సుబ్బారెడ్డి కూతురు గట్టి కౌంటర్
Recommended Video
అమరావతి/ఆళ్లగడ్డ: మంత్రి భూమా అఖిలప్రియ - టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు సమసిపోవడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. అఖిల, ఏవీలతో శుక్రవారం మరోసారి భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు.
మరోవైపు, భూమా అఖిలప్రియ, మౌనికా రెడ్డిల వ్యాఖ్యలపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు ఘాటుగా స్పందించారు. మౌనికా రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తన తండ్రికి ఆరోగ్యం బాగా లేకున్నప్పటికీ ఆళ్లగడ్డలో పార్టీ కోసం, భూమా కుటుంబం కోసం పని చేశారని చెప్పారు.
గవర్నర్పై చంద్రబాబు షాకింగ్: తెరపైకి 'పవన్ కళ్యాణ్', రెచ్చిపోవడం వెనుక ఆయన!
భూమా కేడర్.. నా తండ్రి కారణం
భూమా మౌనికా రెడ్డి మాట్లాడుతూ.. పదేపదే అఖిలప్రియ జోలికి, భూమా కుటుంబం జోలికి వస్తే భూమా కేడర్ చూస్తూ ఊరుకోదని అంటున్నారని, అసలు భూమా కేడర్ ఎక్కడిదని, దానికి తన తండ్రి కారణమని ఏవీ సుబ్బారెడ్డి కూతురు అన్నారు. నేటి భూమా కేడర్ తన తండ్రి చేసిన కృషి అని అభిప్రాయపడ్డారు.
అఖిలకు ఈ అంశాలు మింగుడు పడటం లేదా?
టీడీపీ ఇటీవల సైకిల్ యాత్ర చేపట్టింది. ఆళ్లగడ్డలో ఓవైపు అఖిలప్రియ, మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి యాత్ర చేశారు. తనకు పోటీగా సైకిల్ యాత్ర చేయడాన్ని అఖిలప్రియ, ఆమె వర్గం జీర్ణించుకోలేకపోయింది. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఏవీ సుబ్బారెడ్డి కూతురు కూడా తెరపైకి వచ్చారు. దీనిని కూడా అఖిలప్రియ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఓ వైపు వైసీపీ నుంచి వచ్చిన అఖిలప్రియ, మరోవైపు ఆధిపత్యం కోసం అఖిల వర్సెస్ ఏవీ నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
మీ ఇద్దరి పద్ధతి బాగా లేదు
కాగా, అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలపై గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇద్దరి పద్ధతి బాగాలేదని, ఇలాగే ఉంటామంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అఖిలప్రియ వెంట ఆమె సోదరి నాగమౌనిక, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మళ్లీ తనను కలవాలని వారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో విభేదాలు
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి తమ వర్గం వారికి ఇవ్వాలని పీతల సుజాత, మాగంటి బాబులు పట్టుబడుతున్నారు. ఓ వైపు ఆళ్లగడ్డ, మరోవైపు చింతలపూడిలో చోటు చేసుకున్న పరిణామాలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు రోడ్డుకెక్కడం సరికాదన్నారు. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరు అని, పార్టీలో గ్రూపులు కడితే సహించనని చెప్పారు. కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.
పార్టీ కోసం పని చేయాలి
పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని చంద్రబాబు సూచించారు. అహంభావంతో వ్యవహరిస్తే పార్టీకే కాదు, వ్యక్తులకు కూడా నష్టమన్నారు. గ్రూపుల వల్ల మీరే నష్టపోతారని, మనలో మనమే కొట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతామన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ ముఖ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో టీడీపీని గెలిపించాలని, అందుకు అందరు కలిసి పని చేయాలన్నారు. నేతల మధ్య విభేదాలు తన ఏకాగ్రతకు భంగం కలిగించవద్దన్నారు.