భూమా బతికుంటే అఖిలప్రియ చెంపలు వాయించేవారు:ఎవి సుబ్బారెడ్డి
కర్నూలు : ఆళ్లగడ్డలో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు పతాక స్థాయికి చేరాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియతో తీవ్ర విభేధాల నేపథ్యంలో ఆ నియోజకవర్గం నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆళ్లగడ్డలో సమస్యల పరిష్కారం కోసం మంటూ ఏవి సుబ్బారెడ్డి ఏవి హెల్ప్ లైన్ ప్రారంభించడం కలకలం రేపింది. ఈ హెల్ప్ లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎవి సుబ్బారెడ్డి...మంత్రి భూమా అఖిలప్రియపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన సన్నిహితుడు భూమా నాగిరెడ్డి బతికుంటే నన్ను గుంటనక్కలు అని సంబోధించినందుకు అఖిల ప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోమని చెప్పేవాడంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు
ఇంకా ఎవి సుబ్బారెడ్డి ఏమన్నారంటే..."నన్నుఎవరైనా ఒక్కమాటన్నా భూమా నాగిరెడ్డి ఊర్కొనే వారు కాదు, అది మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం... భూమా నాగిరెడ్డి హీరో అయితే నేను డైరెక్టర్ను. సినిమాలో హీరోనే కనబడతాడు..డైరెక్టర్ కనిపించడు...నేను కూడా అంతే. భూమా వర్థంతి సభలో నేను లేకుంటే.. ఆయన ఆత్మ శాంతిస్తుందా?. భూమా నాగిరెడ్డి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డలో పోటీ చేస్తా. ఆళ్లగడ్డలో ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 7093382333"...అన్నారు.
భూమా నాగిరెడ్డి, ఎవి సుబ్బారెడ్డి ప్రాణ స్నేహితుల అన్న సంగతి తెలిసిందే. అయితే భూమా మరణించిన తర్వాత ఆయన కుమార్తె మంత్రి అఖిలప్రియ...ఏవీ సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో విభేదాలు మొదలయ్యాయి. వాటిని ఆమె లెక్క చేయకపోవడంతో అవి మరింతగా ముదిరి తదనంతర కాలంలో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి. చివరకు సిఎం చంద్రబాబు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన భూమా వర్థంతి సభకు అసలు ఎవి సుబ్బారెడ్డిని ఆహ్వానించకపోవడంతో ఆయన మంత్రి అఖిల ప్రియతో నేరుగా పోరాటానికి దిగారు.
మంత్రి అఖిల ప్రియకు ఆళ్లగడ్డ నియోజక వర్గంలో తన పట్టేంటో చూపాలనుకున్న ఏవీ సుబ్బారెడ్డి ఆ క్రమంలోనే తాజాగా ఏవీ హెల్ప్ లైన్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తున్నఆయన అనుగుణంగా ఇప్పుడే అడుగులు వేయడం ప్రారంభించేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాన్స్ ఇస్తే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటి నుంచే ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.