మలుపు తిరుగుతున్న ఆళ్లగడ్డ రాజకీయం: అఖిలప్రియపై పోటీకి సిద్ధం అన్న ఏవీ కుమార్తె జస్వంతి
ఏపీలో ఆళ్లగడ్డ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. ఏవీ సుబ్బారెడ్డి ,భూమా అఖిల ప్రియ మధ్య కొనసాగుతున్న ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికర క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ వారసురాలు జస్వంతి భూమా అఖిల ప్రియ మీద ఆళ్ళగడ్డలో పోటీకి సిద్ధం అంటున్నారు . తన తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశారని భూమా అఖిల ప్రియపై నిప్పులు చెరుగుతున్నారు జస్వంతి .
ఏవీ, భూమా ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఏవీ తనయ జస్వంతి
టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని చంపటానికి సుపారి ఇచ్చారని ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి భూమా అఖిలా ప్రియాపై ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ హత్యాయత్నం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన జస్వంతి అఖిలపై మాటలతో విరుచుకుపడ్డారు .అఖిల ప్రియ తండ్రి దివంగత భూమా నాగి రెడ్డి ఎప్పుడూ సుబ్బారెడ్డి పిల్లలు తన పిల్లలు అని చెప్పేవారని అంతగా ఉన్న కుటుంబంలో మామ వంటి వాడినే చంపాలని ఎందుకు అనుకున్నారని ప్రశ్నించారు జస్వంతి .
అఖిల ప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యంగా ఉంది
ఇక ఆళ్లగడ్డలో రాజకీయం చెయ్ అని తన తండ్రికి అనుమతి ఇవ్వడానికి అఖిల ప్రియా ఎవరు అని జస్వంతి అడిగారు. తన తండ్రి గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు అని ఆమె పేర్కొన్నారు. తమది ఆళ్ళగడ్డనే అని, అక్కడే రాజకీయం చేస్తామని తెలిపారు జస్వంతి . ఇక తమను రావాలని స్వాగతించటానికి అఖిలప్రియ ఎవరు? అఖిలప్రియను అక్కా అని పిలవాలంటే తనకు అసహ్యం వేస్తోందన్నారు. భూమా నాగిరెడ్డి దంపతులు, ఏవీ సుబ్బారెడ్డి ఎప్పుడూ ఒకటిగా ఉండేవారని ఆమె గుర్తు చేశారు .
భూమా అఖిల ప్రియది క్రిమినల్ మైండ్ సెట్
దేవుడిచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని జస్వంతి ఆరోపించారు. ఇక తండ్రిని పోగొట్టుకున్న అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకోనని, ఆడపిల్లగా నాన్న లేని పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . భూమా అఖిల ప్రియది క్రిమినల్ మైండ్ సెట్ అని వ్యాఖ్యానించారు జస్వంతి . కష్ట పడకుండా మంత్రి అయిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదన్నారు.
Recommended Video
తన తండ్రి ప్రాణం ఖరీదు రూ. 50 లక్షలా ?
భూమా దంపతులు రాజకీయంగా సాగించిన ప్రయాణం , వారి ఏవీ సుబ్బారెడ్డి 30ఏళ్ళ కష్టం వలనే అఖిలప్రియకు మంత్రిగా , ఎమ్మెల్యేగా గౌరవం, ఆ స్థాయి దక్కిందన్నారు జస్వంతి . అడ్డు వచ్చిన వారందర్నీ అఖిలప్రియ చంపుతోందా? అని ప్రశ్నించారు. తన తండ్రిని చంపాలని అఖిలప్రియ వ్యవహరించిన తీరు మహిళలకే సిగ్గుచేటన్నారు. తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50లక్షలా? అంటూ అఖిల ప్రియను టార్గెట్ చేశారు జస్వంతి .మొత్తానికి అఖిల ప్రియ మీద ఏవీ కుమార్తె జస్వంతిని రాజకీయ ఆరంగేట్రం చేయించనున్నారని తాజా పరిణామాలతో తెలుస్తుంది.