భూమా నాగిరెడ్డి బతికుంటే అఖిల చెంప పగిలేది .. రసవత్తరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాజకీయంగా చాలా ఆసక్తికరంగా భూమా అఖిల,ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ మారుతుంది. నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇక టీడీపీ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించటానికి టీడీపీ అధినాయకత్వం కూడా రంగంలోకి దిగటం లేదు. ఒకర్ని మించి ఒకరు మాటల యుద్ధానికి తెరలేపటం కర్నూలు టీడీపీలో దారుణంగా మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది.
దమ్ముంటే ఆళ్లగడ్డలో రాజకీయాలు చెయ్యండి ..ఏవీ సుబ్బారెడ్డి వెనుక ఉంది వారే : భూమా అఖిల కౌంటర్
దమ్ముంటే ఆళ్ళగడ్డలో రాజకీయం చెయ్యమన్న అఖిలకు ఏవీ కౌంటర్
దమ్ముంటే ఆళ్ళగడ్డలో రాజకీయం చెయ్యమన్న అఖిలకు ఏవీ కౌంటర్ వేశారు. భూమా అఖిలప్రియ తనను చంపడానికి ప్రయత్నం చేసిందని టిడిపి నేత, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏ వి సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలకు భూమా అఖిలప్రియ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆళ్లగడ్డలో రాజకీయం చేయాలనుకుంటే దమ్ముంటే రమ్మని తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు అఖిల ప్రియ. ఇక ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనక ఆళ్లగడ్డ వైసీపీ నేతల ప్రోద్బలం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అఖిలకు తప్ప ఆళ్ళగడ్డలో భూమా కుటుంబంలో ఎవరికి పగ్గాలిచ్చినా సంతోషం
గతంలో ఓ క్రషర్ విషయంలో హత్యాయత్నానికి పాల్పడ్డారని అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పై కేసు నమోదైంది. ఇక ఆ కేసుకు సంబంధించి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఏవీ సుబ్బా రెడ్డి వ్యాఖ్యలు చేయడం, భూమా అఖిలప్రియ భర్తకు తాజాగా ఈ హత్యాయత్నం కేసు విషయంలో పోలీసులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలపై మరోమారు స్పందించారు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి. తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆళ్లగడ్డ తన అడ్డా అనే భావనలో అఖిల అఖిల ప్రియ ఉన్నదని, ఆమెకు తప్ప భూమా కుటుంబంలో ఎవరికి పగ్గాలు ఇచ్చినా సంతోషంగా ఉంటుందన్నారు.
భూమా నాగిరెడ్డి బతికుంటే అఖిలను చెంపదెబ్బ కొట్టేవారు
ఇక పార్టీ కోసం తామెంతో కష్టపడ్డామని, తాము కష్టపడడం వల్లే అఖిలకు ఆ స్థానం దక్కిందని ఏ వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆమెకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఊరికే రాలేదని ఆయన అన్నారు. తాను నాడు-నేడు ఎప్పటికీ ఒకలానే ఉన్నానని, ఇప్పటికీ ఏవీ సుబ్బారెడ్డిగానే బతుకుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి వేరు కాదు అన్న విషయాన్ని భూమా నాగిరెడ్డి బ్రతికున్న కాలంలో చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఒకవేళ భూమా నాగిరెడ్డి బతికుంటే అఖిల చెంప పగలగొట్టేవారని ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
పశ్చాత్తాపం చెందితే గౌరవంగా ఉంటుందన్న ఏవీ
తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందితే గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు. కనీసం తప్పు చేసినప్పుడు మౌనంగా అయినా ఉండాలని ఆయన సూచించారు.సుపారీ ఇచ్చి మరీ తనను చంపాలని ప్రయత్నం చేసింది అఖిలప్రియ కాదని తెలిస్తే తనకంటే సంతోషించే వారు ఎవరూ ఉండరు అని ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. నాటి నుండి నేటి వరకు రాజకీయంగా పార్టీ కోసం ఎంతగానో పోరాటం చేశామన్న ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ను 30 ఏళ్ల చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. తమపై బాంబుల దాడి జరిగితే, ఆ దాడి నుంచి క్షేమంగా తప్పించుకున్నామని ఆ నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.
Recommended Video
ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తానన్న ఏవీ సుబ్బారెడ్డి
ప్రత్యర్థులతో పోరాడటం ఎలాగో తనకు అఖిలప్రియ చెబుతున్నారని ఏవీ ఎద్దేవా చేశారు. 35వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన రికార్డు అఖిలదని , ఆళ్లగడ్డ రికార్డును అఖిల బ్రేక్ చేశారని ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. చావడానికైనా సిద్ధమే కానీ రాజీపడనని ఏ వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తానని అఖిల ప్రియ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చిలికి చిలికి గాలివాన మారుతున్న టిడిపి నేతల మధ్య కొనసాగుతున్న వివాదం ముందు ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో అని కర్నూలు జిల్లావాసులు, ఆళ్లగడ్డ వాసులు ఆసక్తిగా చూస్తున్నారు.