అవనిగడ్డ వైసీపీలో ముదిరిన పోరు-ఎంపీ అనుచరులపై చెప్పులతో ఎమ్మెల్యే వర్గం దాడులు..?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వర్గపోరు కూడా తెరపైకి వస్తోంది. ముఖ్యంగా ఎన్నికల నాటికి మారాల్సిన సమీకరణాలు ఇప్పుడే తెరపైకి వస్తుండటంతో ఇవి కాస్తా దాడుల వరకూ వెళ్తున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్ధితే ఎదురైంది.
కృష్ణాజిల్లా అవనిగడ్డ వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బందరు ఎంపీ బాలశౌరి వర్గానికీ, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వర్గానికీ మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరోసారి బయటపడింది. నియోజకవర్గంలోని నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్ పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన బందరు ఎంపీ బాలశౌరి, ఆయన అనుచరులపై ఎమ్మెల్యే వర్గం చెప్పులతో దాడి చేసింది. దీంతో వారు కూడా ప్రతిదాడులకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.
ఈ క్రమంలోనే బందరు ఎంపీ బాలశౌరి అనుచరుల్ని ఎమ్మెల్యే రమేష్ బాబు వర్గీయులు చెప్పులతో కొట్టి అవమానించారు. దీంతో వారు కూడా తీవ్ర వాగ్వాదానికి దిగారు. గతంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేష్ బాబు అనుచరుల మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య పరిస్ధితి ఉప్పునిప్పుగా ఉంటూ వస్తోంది. ఇవాళ బందరు ఎంపీ వర్గీయులు నియోజకవర్గంలోకి రావడంతో ఇదే అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యవహారం దాడుల వరకూ వెళ్లింది. చివరకు స్ధానికుల జోక్యంతో పరిస్ధితి సద్దుమణిగింది.