ఆయేషా హత్య కేసులో మళ్లీ దర్యాప్తు, 90 రోజుల్లో నివేదిక, సీఎం చంద్రబాబు ఆదేశం
ఆయేషా హత్య కేసులో అసలు నిందితులను పట్టుకునేందుకు అవసరమైతే మళ్లీ దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం ఉన్న రెండు మార్గాలపై దర్యాప్తు చేయాలని భావిస్తుంది.
విజయవాడ: ఆయేషా హత్య కేసులో అసలు నిందితులను పట్టుకునేందుకు అవసరమైతే మళ్లీ దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందుకోసం ఉన్న రెండు మార్గాలపై దర్యాప్తు చేయాలని భావిస్తుంది.
ఈ విషయమై డీజీపీ సాంబశివరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాపీని క్షుణ్ణంగా పరిశీలించినట్లు వారు చంద్రబాబుకు తెలిపారు.
ముఖ్యంగా కింది కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు మధ్య ఉన్న తేడా పరిశీలించాలని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా? లేదా ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలా? అనే రెండు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
సత్యంబాబుకు కృష్ణా జిల్లా కలెక్టర్.. ఇల్లు, తాత్కాలిక ఉద్యోగం కల్పించిన అంశం కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో కూడా మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఈరోజు లేదా రేపటిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు తెలిసింది. దర్యాప్తు నివేదికను 90 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని కూడా సూచించినట్లు సమాచారం.