ఆయేషా మీరా కేసులో సిట్ విచారణ...తల్లిదండ్రుల నుంచి వివరాల సేకరణ
గుంటూరు జిల్లా: విజయవాడలోని ఓ వసతిగృహంలో 10 సంవత్సరాల క్రితం హత్యకు గురైన ఆయేషా మీరా కేసును పునర్విచారణ చేపట్టిన సిట్ బృందం ఆదివారం ఆమె స్వస్థలం అయిన గుంటూరు జిల్లా తెనాలికి వచ్చింది. ముఖ్య విచారణాధికారి డీఐజీ శ్రీకాంత్, డీఎస్పీలు హైమావతి, శ్రీలక్ష్మి ఇతర సిబ్బంది విచారణ నిమిత్తం స్థానిక పాండురంగపేటలోని ఆయేషా మీరా తల్లిదండ్రులైన షంషాద్బేగం, ఇక్బాల్ భాషాల నివాసగృహానికి విచారణ కోసం చేరుకుంది.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెనాలికి చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్యకేసులో ఎపి ప్రభుత్వం తాజాగా ఏర్పాటుచేసిన సిట్ బృందం ఆయేషా తల్లిదండ్రులు సంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలను సుమారు ఐదు గంటలకు పైగా విచారించింది.
విచారణ బృందం సభ్యులు వారి వాంగ్మూలాన్ని వీడియో రికార్డుచేశారు. లిఖితపూర్వకంగా కూడా సమాచారం సేకరించారు. ఉదయం పది గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 3 గంటల వరకు సాగింది. సిట్ విచారణ ఐదు గంటలకు పైగా సాగగా ఈ సమయంలో మీడియాతో సహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు.
సిట్ విచారణ అనంతరం ఆయేషా మీరా తల్లిదండ్రులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సిట్ బృందం తమను విచారించిన తీరు, వారినుంచి వచ్చిన స్పందనను బట్టి తమ కుమార్తె కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని చెప్పారు. హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందనే వివరాలు అన్నీ సిట్ కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారని, తాము అన్ని విషయాలు వివరించామని చెప్పారు. ఈసారి అసలు దోషులు బయటకు వస్తారన్న నమ్మకం కలుగుతోందని ఆయేషా తల్లిదండ్రులు అన్నారు.