ఆయేషా మీరా కేసులో కొత్త ట్విస్ట్:నార్కో టెస్ట్ వాయిదా కోరిన ముగ్గురు నిందితులు
అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యా కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఏడుగురు తొలుత నార్కో అనాలిసిస్ టెస్ట్ కు తమ అంగీకారం తెలిపినా తీరా వ్రాతపూర్వక అనుమతి విషయం వచ్చేసరికి ముగ్గురు వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది.
నిందితులు లేదా అనుమానితుల అనుమతి లేకుండా నార్కో టెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉదహరిస్తూ ఆయేషా మీరా కేసు నిందితుల్లో ముగ్గురు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తమకు ఈ నార్కోఎనాలిసిస్ టెస్ట్ ను వాయిదా వేయాలని కోరుతూ వారు ఈ అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిసింది. వీరి వినతిని స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే నెల 4 వ తేదీకి వాయిదా వేసింది.
కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్లో 2007 డిసెంబర్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో తొలుత దోషిగా పేర్కొన్న సత్యంబాబు చివరకు నిర్దోషిగా విడుదల అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణకు ఉమ్మడి హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
దీంతో సిట్ అధికారులు ఈ కేసులో అనుమానితులు...ఇంచిపుడి పద్మ (హాస్టల్ వార్డెన్), ఇంతపుడి శివ రామకృష్ణ (హాస్టల్ వార్డెన్ యొక్క భర్త), అయేషా రూమ్మేట్స్ సౌమ్య, కె.కవిత, ప్రధాన నిందితుడు కోనేరు సతీష్ బాబు(మాజీ మంత్రి కోనేరు రంగారావు మనువడు), అబ్బురి గణేష్ మరియు చింతా పవన్ కుమార్ వీరికి నార్కో ఎలిలిసిస్ టెస్ట్ మరియు బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఆసిలేటింగ్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్ టెస్ట్ వారి అనుమతి తీసుకున్న అనంతరం నిర్వహిస్తామని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ ఏడుగురు నిందితులలో నలుగురు ఆయా టెస్ట్ లకు అంగీకారం తెలిపినా ముగ్గురు మాత్రం తాజాగా తమ వ్రాతపూర్వక అనుమతిని ఇచ్చేందుకు వాయిదాను కోరుతూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో విచారణా అధికారులు వీరికి ఆ టెస్ట్ లు నిర్వహించే అవకాశం లేకుండా పోతోంది. ఈ విషయమై ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రధాన నిందితులు ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు హాజరుకాకుండా కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు వారిని ప్రభావితం చేస్తున్నట్లుగా మాకు సమాచారం ఉంది. అందుకే నిందితుల్లో కొందరు ఆ టెస్ట్ కు హాజరుకాకుండా వారు వివిధ కారణాలతో తప్పుదోవ పట్టేలా చేస్తున్నారు. వారు సందేహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఈ టెస్ట్ వల్ల ఆరోగ్యం పై ఎటువంటి దుష్ప్రబావం ఉండదని తెలిసినా వారు పదే పదే అదే అనమానాలు వ్యక్తం చేస్తుండటం గమనించాలని అంటున్నారు.