నత్వానీని మించిపోయారు: అయోధ్య రామిరెడ్డి కే తొలి స్థానం: కేసుల్లోనూ అదే స్థాయిలో..!
పెద్దల సభకు వైసీపీ నుండి జగన్ ఎంపిక ఆషామాషీగా చేసింది కాదు. సామాజిక సమీకరణాల్లో భాగంగా..యాభై శాతం బీసీలకు ఇచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ అదే సమయంలో అపర కుబేరుల కు స్థానం కల్పించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా తన ఇంటి వచ్చి చేసిన అభ్యర్ధన మేరకు పరిమళ్ నత్వానీ కి జగన్ సీటు ఖరారు చేసారు. అదే సమయంలో పార్టీలో తొలి నుండి తన కు అండగా నిలిచిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ఖరారు చేసారు.
ఈ ఇద్దరూ పారిశ్రామిక వేత్తలుగా సుపరిచితులు. అయితే, వారు తమ రాజ్యసభ నామినేషన్ల తో పాటుగా దాఖలు చేసిన ఆస్తుల వివరాలు చూస్తే అంబానీ సిఫార్సు చేసిన నత్వానీ కంటే వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డే అపర కుబేరుడు. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఆయన మొత్తంగా అన్నింటా ప్రథమ స్థానంలో నిలిచారు.
నత్వానీ కంటే అయోధ్య రామిరెడ్డి ధనికుడు..
ప్రస్తుతం ఏపీ నుండి పెద్దల సభకు ఎంపికైన నలుగురిలో సహజంగా రిలయన్స్ గ్రూపు ఇండిస్టీస్ ఛైర్మన్ పరిమళ్ నత్వాని ధనికుడిగా అందరూ అంచనా వేస్తారు. కానీ, వాస్తవం మాత్రం వేరుగా ఉంది. నామినేషన్ల సందర్భంగా సమర్పించిన అఫిడివిట్లు అసలు విషయాలు బయట పెట్టింది. ఈ అఫిడవిట్ల ప్రకారం పరిమళ్ నత్వాని కన్నా అయోధ్యరామిరెడ్డి అత్యధిక ఆస్తులున్నాయి. ఆయన స్థిర, చరాస్తులన్నీ కలిపి 2,377 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తనకు మొత్తం 2,376 కోట్ల రూపాయలు చరాస్తి ఉందని,55 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ భూమి ఉందని, నివాస గృహాల విలువ 17.55 కోట్లని ఆయన పేర్కొన్నారు. అప్పులు 61 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అయోధ్య రామిరెడ్డి భార్య పేరిట చరాస్తి 128.72 కోట్లు, స్థిరాస్తి 13 కోట్లు, వ్యవసాయేతర భూమి విలువ 26 కోట్లు, నివాస గృహాల ద్వారా ఆస్తి 41 కోట్లు ఉన్నాయని, అప్పులు 93 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కుమార్తె పేరున మరో 13 కోట్ల రూపాయల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
నత్వానీ ఆస్తులు ఇలా ఉన్నాయి
రెండవ స్థానంలో నిలిచిన నత్వాని తన ఆస్తుల విలువను నాలుగు వందల కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన చరాస్తి 180 కోట్లు, స్థిరాస్తి 179 కోట్లు, బరగారం, రంగురాళ్ల విలువ 1.35 కోట్లు, ఇతర భూమి 6.50 కోట్ల రూపాయలు, 1.65 కోట్ల రూపాయల విలువైన భవనాలు ఉన్నట్లు ప్రకటిరచారు. 203 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య పేరిట చరాస్తి 21.25 కోట్లు, స్థిరాస్తి 15 కోట్లు, బంగారం, రంగురాళ్లు కలిపి 5.71 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆమె పేరిట అప్పులు ఆరు కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Recommended Video
ఆయన పైన పది కేసులు.
ఇక, అయోధ్య రామిరెడ్డి ఆస్తుల్లోనే కాదు..కేసుల విషయంలోనూ టాప్ లో ఉన్నారు. తన పైన మొత్తం పది కేసులు ఉన్నట్లుగా ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ లో క్విడ్ ప్రో కో కేసు ను అందులో వివరించారు. అయితే, పరిమళ్ నత్వానీ పైన ఎటువంటి కేసులు లేవు. తొలి నుండి జగన్ తో సన్నిహితంగా ఉంటున్న అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి నర్సరావు పేట లోక్ సభ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, 2019 ఎన్నికల సమయంలో ఆయన పార్టీకి నిధుల సమీకరణలో..ఆర్దికంగా తోడ్పాటు అందించటంలో కీలక భూమిక పోషించారు. దీంతో..2019 ఎన్నికల సమయంలో ఆయనకు సీటు ఇవ్వలేని పరిస్థితుల్లో..ఇప్పుడు రాజ్యసభ కేటాయించారు. అయితే, ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి ఆస్తుల విషయం అఫిడవిట్ ద్వారా బయటకు రావటంతో..ఇది రాజకీయంగానే కాకుండా..వైసీపీలో ప్రధానంగా హాట్ టాపిక్ గా మారింది.