రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని జగన్ అనడంపై మంత్రి అసహనం
విశాఖపట్నం: తనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారని, వాటిని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి అయ్యన్న పాత్రుడు ఆదివారం సవాల్ చేశారు.
రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని జగన్ పదేపదే అనడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అసలు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే జగన్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన వల్లే అసలు రాజకీయాల్లో విలువలు దిగజారాయని ఆరోపించారు.
ఇతరులకు నీతులు చెప్పడం జగన్ మానుకోవాలని సూచించారు. బురదలో కూరుకుపోయిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలపై దాన్ని చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాజకీయ వ్యవస్ధను భ్రష్టుపట్టించింది జగన్ కాదా అని నిలదీశారు. జగన్ లాంటి నేతల వల్ల రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయన్నారు. తమపై దుష్ప్రచారం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. అవినీతిని నిరూపించకుండా గాలిమాటలు మాట్లాడుతున్నారన్నారు. బురదలో కూరుకుపోయి మాపై బురదజల్లే ప్రయత్నం చేయడం తగదన్నారు.