గంటా, అయ్యన్నల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు: ‘రాజీనామా’! ‘బదిలీ’నే కారణం!
విశాఖపట్నం: జిల్లాలో మరోసారి ఆ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య అధికారుల బదిలీ విషయం తాజా వివాదానికి కారణమైంది.
గంటాపై అయ్యన్న చిందులు
తాను జిల్లా నుంచి బయటకు పంపించిన పశుసంవర్థక శాఖ జేడీ కోటేశ్వరరావు, ఈవో సూర్యప్రకాశ్లను తిరిగి విశాఖలోనే నియమించారని మంత్రి గంటాపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. తాను బదిలీ చేసిన అధికారులను తిరిగి తీసుకురావడమేంటని అయ్యన్న.. గంటాపై చిందులు తొక్కారట.
Recommended Video
అయ్యన్న రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారా?
రెండు నెలల కిందట డీఎల్ఎస్ఏ జిల్లా కమిటీని తనకు తెలియకుండా గంటా అనుచరుడు వెంకటప్పడును నియమించుకుని తనను అవమానించారంటూ జేడీ, ఈవోలపై ఆయన మండిపడ్డ విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో తన సిఫార్సును లెక్క చేయలేదనే కారణంగా మంత్రి అయ్యన్నపాత్రుడు తన పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి.
దుష్ప్రచారమే..
కాగా, తాను రాజీనామా చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ.. కొంతమంది తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజీనామా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.
రాజకీయంగా ఎదుర్కొలేక..
తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశుసంవర్థక శాఖకు సంబంధించిన విషయం ఎప్పుడో సమసిపోయిందని అన్నారు. అయితే, గతంలో కూడా గంట, అయ్యన్నల మధ్య పలుమార్లు వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.