రియల్ ఎస్టేట్ ఏజెంట్ లా జగన్, విశాఖ ఉక్కుపై ఆర్టిస్ట్ లే ఆశ్చర్యపోయేలా వైసీపీ డ్రామాలు: అయ్యన్న ఫైర్
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ లో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూములను విక్రయించాలని కేంద్రానికి పెట్టిన ప్రతిపాదనపై టిడిపి నిప్పులు చెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెబుతూనే, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి వైసీపీ కుట్ర చేస్తోందని టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
వైసీపీ చేసేది విశాఖ స్టీల్ ప్లాంట్ భక్షణ ఆరాట యాత్ర
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఫిబ్రవరి 20వ తేదీ శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విశాఖ లో వైయస్సార్ సిపి నాయకులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర జీవీఎంసీ వద్ద నుండి మహాత్మాగాంధీ విగ్రహం నుండి మొదలై విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు కొనసాగుతుందని విజయసాయి రెడ్డి అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిర్వహించేది విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర కాదని, విశాఖ స్టీల్ ప్లాంట్ భక్షణ ఆరాట యాత్ర అని మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు.
సీఎం జగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారారని ఆగ్రహం
సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పై కన్నేశాడని, అమ్మేసే పేరుతో కొట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారారని ఆరోపించారు. జగన్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్ లా 7 వేల ఎకరాలను అమ్మేస్తామని ప్రకటించారని, ఇక విజయసాయి యాత్ర పేరుతో కబ్జా చేయాల్సిన భూమిని, సర్వే చేయడం కోసం రంగంలోకి దిగారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
జగన్ రెడ్డి, సాయి రెడ్డి ఏపీలో చిందులు ఆపి ఢిల్లీలో ఊపితే మంచిది
విశాఖ ఉక్కు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చూసి ఆర్టిస్టులే ఆశ్చర్య పోతున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ రెడ్డి, సాయి రెడ్డి ఏపీలో చిందులు ఆపి ఢిల్లీలో ఊపితే మంచిదంటూ అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ విధానాలు అమ్మటం, కూల్చడం, తాకట్టు పెట్టడం , అప్పులు చేయడం అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది .
భూముల కబ్జా కోసమే అమ్మకం డ్రామాలు .. తరిమికొట్టాలని టీడీపీ ఫైర్
వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ దిగమింగే ప్రయత్నం చేస్తోందని రెండు లక్షల కోట్ల విలువైన భూములు కబ్జా చేయడం కోసం కుట్ర చేస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. జగన్ ఆడుతున్న డ్రామాలు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకొని గట్టిగా నిలదీయాలని చెప్తున్నారు. వైసీపీ నేతలకు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదికలపై మాట్లాడే అర్హత లేదని , వారిని ప్రజలు తరిమి కొట్టాలని అంటున్నారు.