తెలుగు భాషను కిలికిలి భాషగా మార్చిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రెడ్డిగారు.. జగన్ పై అయ్యన్నపాత్రుడు వ్యంగ్యం
టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, అలాగే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు వైయస్సార్ చేయూత పథకం ద్వారా రెండో ఏడాది ఎస్సీ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి 45 నుండి 60 సంవత్సరాల వయసున్న మహిళలకు 18,750 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక వైయస్ జగన్ భాషపై విరుచుకుపడిన అయ్యన్నపాత్రుడు ఆయన భాషలో తప్పులను వెతికి పట్టుకున్నారు.
తెలుగు భాషను వింతవింతగా పలుకుతూ వినూత్న కిలికిలి భాష గా మార్చిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రెడ్డిగారు అంటూ జగన్ భాష పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.వితంతవులు కాదు వితంతువులు అని అనాలి. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసావు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశావు అంటూ చిట్టచివరకు మిగిలిన తెలుగు భాషని నాశనం చేస్తున్నావని వ్యాఖ్యానించారు. నీ నత్తి ,నంగి మాటలతో గుచ్చిగుచ్చి తెలుగు భాషను చంపేస్తున్నావు.. నీకు దండం పెడతాం కనీసం తెలుగు భాషను అయినా ఖూనీ చేయకుండా వదిలేయ్ అంటూ అయ్యన్నపాత్రుడు జగన్ భాష పై విమర్శలు చేశారు.
ఇదే సమయంలో విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసిన అయ్యన్న ఏమయ్యా కే2 రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ లాంటి ప్లాన్లు ఇప్పుడు ఏమి వేయడం లేదా? లేకపోతే అంతకు మించి పెద్ద ప్లాన్లు వేస్తున్నావా ? అంటూ ప్రశ్నించారు. నువ్వు వేస్తున్న ఒక పెద్ద ప్లాన్ ఢిల్లీ పెద్దలకు తెలిసిందటలే.. నీ నట్లు బిగిస్తారు ఉండు అంటూ సెటైర్ వేశారు. ఇక గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ పదవి విజయసాయి రెడ్డి కి ఇప్పించడం కోసం ప్రయత్నించారని ఒక పేపర్ క్లిప్పింగ్ ను ట్వీట్ చేశారు అయ్యన్నపాత్రుడు.