విజయసాయి, బొత్స, అవంతి అవినీతి: రూ.23 కోట్లు కొట్టేశారు, అయ్యన్న ఆరోపణలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు అందరూ అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ. 4 వేల వరకు దోపిడీ జరిగిందని ఆరోపించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నా సీఎం జగన్ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. దీనిని బట్టి అవినీతిలో సీఎంకు కూడా భాగం ఉందేమోనని ప్రజలు అనుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
విశాఖపట్టణం కేంద్రంగా విజయసాయి రెడ్డి చేస్తోన్న దోపిడీ జగన్కు తెలియదా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములు, సింహాచలం భూములు కొట్టేయడానికి విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైజాగ్ పరిధిలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే భూమి చదును పేరుతో విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ రూ. 23 కోట్లు కొట్టేశారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video
దీంతోపాటు మంత్రి జయరాం అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టామని గుర్తుచేశారు. మరీ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.. అవినీతి మంత్రిని సీఎం జగన్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ మంత్రి జయరాంపై చర్యలు తీసుకుంటే.. మీ అవినీతిని ఆయన ఎక్కడ బయటపెడతారో భయపడుతున్నారా అని నిలదీశారు. అవినీతికి సంబంధించి జయరాంపై చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకెళతామని అయ్యన్నపాత్రుడు చెప్పారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.