అసదుద్దీన్తో దోస్తీ: రాయల టీ ఆజాద్ ఆలోచనే?
రాయల తెలంగాణ ప్రతిపాదనను కాంగ్రెసు అనంతరపురం శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తొలుత ప్రతిపాదించారు. దానికి మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నుంచి మద్దతు లభించింది. తాము సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నామని, విభజన అనివార్యమైతే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని అసదుద్దీన్ మొదటి నుంచి అంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల బిజెపి బలం పెరుగుతుందని ఆయన అనుమానిస్తున్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వల్ల తమ పార్టీ విస్తరించుకోవసచ్చుననేది అసదుద్దీన్ ఆలోచన. దీనికి కాంగ్రెసు సీనియర్ నేత, జివోఎం సభ్యుడు గులాం నబీ ఆజాద్ మద్దతు లభించినట్లు చెబుతున్నారు. మూడు నాలుగు రోజుల కిందట ఆజాద్ సోనియా గాంధీని కలిశారు. ఈ భేటీలో ఆజాద్ రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే పార్టీకి కలిగే లాభం గురించి సోనియాకు వివరించినట్లు, సోనియా దానికి మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి.
ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం రాయల తెలంగాణ ప్రతిపాదనపై సీరియస్గా ఆలోచన చేసినట్లు ప్రచారం ఊపందుకోవడానికి తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటన కూడా దోహదం చేసింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఇంకా కొట్టి పారేయలేదని, అది పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.
ఆజాద్తో అసదుద్దీన్కు ఉన్న సంబంధాల వల్ల రాయల తెలంగాణ ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. మజ్లీస్ మద్దతును కూడగట్టుకోవడానికి ఇది పనికి వస్తుందని ఆజాద్ సోనియాకు వివరించినట్లు చెబుతున్నారు. ఏమైనా, రాయల తెలంగాణకు పెద్దగా మద్దతు లభించడం లేదు.