అజార్ ప్రచారం: పొన్నాల సిఎం అవుతారన్న జయప్రద
సాయంత్రం 4గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కొత్తకోటలో హెలిప్యాడ్లో దిగి రోడ్షోలో పాల్గొన్నారు. కాగా 4గంటల నుండి 4.45గంటల వరకు రోడ్షోలో పాల్గొని తిరిగి వెళ్లారు. హెలిప్యాడ్ దిగగానే అసెంబ్లీ అభ్యర్థి పవన్కుమారెడ్డి అజారుద్దీన్కు ఘనస్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రావుల రవీంధ్రనాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విశ్వేశ్వర్, బాలమణెమ్మ, బోయేజ్లు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.
పొన్నాలకు మద్దతుగా జయప్రద ప్రచారం
వరంగల్: పార్టీ ప్రచార బాధ్యతలతో తన నియోజకవర్గంలో ప్రచారానికి సమయం కేటాయించుకోలేకపోయిన తెలంగాణ పిసిసి చీఫ్, జనగామ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య చివరి రోజయిన సోమవారం విస్తృతంగా పర్యటించారు. పొన్నాలకు మద్దతుగా ఎంపి, సినీ నటి జయప్రద ఆయనతోపాటు ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్న జయప్రద, పొన్నాలతోపాటు ప్రచార వాహనంలో జనగామ నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యను గెలిపించాలని ప్రజలను కోరారు. పొన్నాల ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలున్నాయని పలు కూడళ్లలో ప్రజలకు వివరించారు. స్నేహబంధంతోనే పొన్నాల లక్ష్మయ్య కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు జయప్రద తెలిపారు. ఆమెతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. పొన్నాల సిఎం అవుతారని ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జయసుధ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.