కదులుతున్న రైలు నుండి కిందపడిన యువతి: 6 గంటల నరకయాతన
ఏలూరు: కదులుతున్న రైలులో నుండి ఓ యువతి జారి బురదలో పడిపోయింది. సుమారు 6 గంటలకు పైగా బురదలోనే సహయం కోసం ఎదురు చూసింది. రైల్వే గ్యాంగ్మెన్ ఆమెను చూడడంతో ఆమె ప్రాణాలు దక్కించుకొంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజేశ్వరి విజయవాడ నుండి పూరీ ఎక్స్ప్రెస్లో స్వంత ఊరికి బయలుదేరింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు- గుమ్ములూరు వద్ద ఆమె రైలు తలుపువద్ద నిలబడింది. ప్రమాదవశాత్తు రైలు నుండి కాలుజారి కిందపడిపోయింది. అయితే రాజేశ్వరి కిందపడిన ప్రాంతంలో బురద ఎక్కువగా ఉంది. దీంతో ఆమె ఆ బురదలోనే కూరుకుపోయింది.
ఉదయం 9 గంటల సమయంలో ఆ యువతి రైలు నుండి కిందపడిపోయింది. దీంతో బురదలో సుమారు 6 గంటలకు పైగా ఉంది. అయితే రైల్వే గ్యాంగ్ మెన్ పట్టాలను తనిఖీ చేస్తూ ఆ దారిగుండా ప్రయాణం చేస్తున్నాడు.
అయితే బురదలో కూరుకుపోయిన ఆ యువతిని అతను చూశారు. ఇతరుల సహయంతో ఆమెను బురద నుండి బయటకు తీశారు. బాధితురాలికి సపర్యలు చేశారు.అంబులెన్స్ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. .ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.