కడప జిల్లాలో దారుణం: విద్యార్థిని ఫోన్ చేసి పిలిచి...పొడిచి చంపేశారు...
కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రాజంపేటలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. రాజంపేట ప్రభుత్వ డిగ్రి కాలేజి సమీపంలో ఈ హత్య జరిగింది. హత్యకు ముందు విద్యార్థిని ఇక్కడకు ఫోన్ చేసి పిలిపించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల్లో రెండు గ్రూపుల మధ్య గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు...వివరాల్లోకి వెళితే...
అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజిలో బిటెక్ సెకండియర్ చదువుతున్నసోమసాయిని కొందరు గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. అయితే సోమసాయిని పక్కా ప్లాన్ ప్రకారం ఫోన్ చేసి పిలిపించి ముందు దాడిచేసి ఆ తరువాత కత్తులతో పొడిచి చంపేసినట్లు మృతుడి శరీరంపై గాయాలను బట్టి తెలుస్తోంది. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు.
డిగ్రీ కాలేజీ సమీపంలో దగ్గర రక్తపుమడుగులో నిర్జీవంగా పడున్న సోమసాయిని స్థానికులు చూపి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మరణవార్త విని సంఘటనా స్థలానికి చేరుకున్నసోమసాయి తల్లి కొడుకుని ఆ స్థితిలో చూసి కుప్పకూలిపోయింది. సాయి తండ్రి రెండు రోజుల కిందటే దైవదర్శనం కోసమని షిర్డికి వెళ్లారని, ఆయనకు విషయం తెలిస్తే అసలు తట్టుకోలేరని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మరోవైపు వారం క్రితం సోమసాయి చదువుతున్న అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజిలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ గొడవల నేపథ్యంలోనే సోమసాయి హత్య జరిగి వుంటుందని, హత్యకు ముందు తెలిసిన వాళ్ల నుంచి ఫోన్ వస్తేనే సోమసాయి అక్కడకు చేరుకున్నట్లుగా భావిస్తున్నారు. మరోవైపు ఏదైనా ప్రేమ వ్యవహారం లాంటిది కూడా ఈ దారుణానికి కారణమైఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.