రైలు ముందు నిల్చొని సెల్ఫీ: బీటెక్ విద్యార్ధి ప్రాణం తీసింది
అమరావతి: తమ స్మార్ట్ఫోన్లలో సెల్ఫీలు తీసి వాటిని సోషల్ మీడియా వెబ్ సైట్లలో పోస్ట్ చేసి లైకులు సాధించాలనుకునే వారికి ఇదొక గుణపాఠం. కర్నూలులో సెల్ఫీ మోజు ఓ విద్యార్ధి ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్ధిని రైలు ఢీకొట్టిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ సమీపంలో జరిగింది.
బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివారాలిలా ఉన్నాయి. పట్టాలపై నిలబడి వెనుక నుంచి వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ వీడియో దిగేందుకు ప్రయత్నించిన బీటెక్ విద్యార్ధిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మండలానికి చెందిన ఇద్రూస్ బాషా (20)గా గుర్తించారు.
నెరవాడలోని ఆర్సీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోజూ ఉదయం వాకింగ్కు వెళ్లి, రైల్వే ట్రాక్ సమీపంలో సెల్ఫీలు దిగడం ఇతగాడి హాబీ. విద్యార్ధి మృతిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.