ప్రచారంలో వేడి పెంచిన విజయమ్మ ! బాబు తనపై ఉన్న 17 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు : విజయమ్మ
కర్నూలు : ప్రచారానికి మరికొన్ని గంటలే ఉండటంతో వయోజనులను ఆకట్టుకునేందుకు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు నేతలు. అన్నివర్గాలను మచ్చిక చేసుకొని ఓట్లరూపంలో మలచుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. గతంలో వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి .. జగన్ను ఆశీర్వదించాలని కోరారు.
ఉక్కు పరిశ్రమ ఏదీ ? గిట్టుబాటు ధర ఏమైంది : కేసీఆర్పై రేణుకా ఫైర్
స్టే తెచ్చుకున్న బాబు ..
తమ ప్రత్యర్థి, సీఎం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు విజయమ్మ. చంద్రబాబు తనపై ఉన్న 17 కేసుల్లో స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. కానీ బయటకి మాత్రం బాబ్లీ ప్రాజెక్టును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు ఒక్కటే ఉందని చెప్తున్నారని మండిపడ్డారు. జగన్పై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కక్ష గట్టాయని ఆరోపించారు విజయమ్మ. జగన్పై కేసులు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు.
హోదాను తాకట్టుపెట్టారు ..
ఏపీ ప్రజల సంజీవని .. ప్రత్యేకహోదాను సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. గత ఎన్నికల తర్వాత బీజేపీతో కొనసాగి .. సరిగ్గా ఏడాది ముందు ఎన్డీఏ నుంచి బయటకు రావడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. తొలుత హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని ... తర్వాత ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు హోదా గురించి తెలియదా ? ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు.
అన్నివర్గాలను వంచించారు
రాష్ట్రంలోని అన్నివర్గాలను చంద్రబాబు విస్మరించారని విరుచుకుపడ్డారు విజయమ్మ. బీసీ బాలికల కోసం వసతి గృహలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ, ట్రాన్స్ కో కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బస్సు చార్జీలు, కరెంట్ చార్జీల .. బాదుడుతో ప్రజల మీద పెనుభారం మోపారని మండిపడ్డారు. గ్రామాల్లో యథేచ్చగా బెల్ట్ షాపులు నడుస్తోన్న చోద్యం చూశారని గుర్తుచేశారు.
వైసీపీ సర్కార్తోనే సుభిక్షంగా రాష్ట్రం
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు. ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జగన్ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి కాదు కదా ... రాష్ట్రం వెనక్కి వెళ్లిందని విమర్శించారు.