రాష్ట్రాన్ని దివాళా తీయించిన బాబు..! ఏ ముఖం పెట్టుకుని మద్దత్తు అడుగుతున్నారన్న వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్ : ఏపి సీయం చంద్రబాబు నాయుడు పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ లో తలపెట్టబోతున్న దీక్షకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్షాలను మద్దతు అడుగుతారని అన్నారు. నాలుగేళ్ళు కేంద్రంలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. అన్నివిధాలుగా చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ డబ్బులో ధర్మపోరాట దీక్షలు ఎలా చేస్తారని వైవీ నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఎన్టీపీసీకి విద్యుత్ బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేక బాండ్లు జారీ చేస్తున్నారని సుబ్బారెడ్డి విమర్శించారు.
ఇప్పటికే మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినా సరే ఈ పరిస్ధితి తలెత్తలేదని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్ధితికి తెచ్చారని, అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబుకు నిజంగా ప్రత్యేక హోదా విషయంలో చిత్తుశుద్ది ఉంటే తమ నాయకుడు జగన్మోహనరెడ్డి చెప్పినట్లుగా ఆరోజు తమతో పాటే టీడిపి ఎంపీలు కూడా రాజీనామాలు చేసేవారన్నారు. ప్రత్యేకహోదా గురించి చంద్రబాబు ఏనాడు ప్రస్థావన తీసుకురాలేదని నరేంద్రమోది చాలాసార్లు గుర్తు చేసారని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.