రెండు రాష్ట్రాల్లోనూ పాలన ఒకటే: సీఎం కేసీఆర్, సీఎం జగన్ లపై బాబుమోహన్ ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పాలన ఒకే విధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల స్వార్థపూరిత కుటుంబ పాలన కొనసాగుతోందని బాబు మోహన్ ఫైర్ అయ్యారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే రకంగా పరిపాలిస్తున్నారు అని, దాడులకు పాల్పడడం, పేద బడుగు బలహీన వర్గాలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టిస్తుంటే, ఏపీలో శిరోముండనాలు చేయిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ మీద దుష్ప్రచారం చేయడానికి కేసీఆర్ చాలా చేస్తున్నారని మండిపడిన బాబు మోహన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని మోడీ ప్రభంజనం మొదలైందని అందుకు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితమే సాక్ష్యమని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. దుబ్బాక స్ఫూర్తితో గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామని పేర్కొన్న బాబుమోహన్ ఎవరెన్ని చేసినా గ్రేటర్ వాసులు బీజేపీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video
ఒకపక్క గ్రేటర్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది . అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి . ముఖ్యంగా బీజేపీ , టీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీగా పోరాటం సాగుతుంది . ఏది ఏమైనా బీజేపీ నేతలు ఈ సారి గ్రేటర్ లో పాగా వెయ్యాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు.