తెరాసలోకి బాబుమోహన్, శాపం పెట్టినా మేమే: కెసిఆర్
హైదరాబాద్: మాజీ మంత్రి బాబు మోహన్, మల్కాజిగిరి శాసన సభ్యులు ఆకుల రాజేందర్లు గురువారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో వారు కారు ఎక్కారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. పాత ప్రభుత్వాల వల్ల తెలంగాణ రాత మారదన్నారు. తెలంగాణకు మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలన్నారు.
ఎవరెన్ని శాపాలు పెట్టినా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెరాస అత్యధిక స్థానాలు గెలుస్తుందని, అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతి అంతం కావాలన్నారు. రాజకీయ అవినీతిని అందరం కలిసి పాతరేద్దామన్నారు.
ప్రజలు డబ్బులకు, తాయిలాలకు మోసపోవద్దని సూచించారు. నూటికి నూరు శాతం తెరాస ప్రభుత్వం వస్తుందన్నారు. అనుకున్న ఫలితాలు సాధిస్తామన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు టిడిపి, కాంగ్రెసు పార్టీలే కారణమన్నారు. కొత్త రాష్ట్రం... కొత్త నాయకత్వం.. కొత్త పంథాతో ముందుకు పోదామన్నారు.
టిడిపి, కాంగ్రెసు పార్టీలు ఆకాశం నుండి ఊడిపడలేదన్నారు. తెలంగాణలో సకల కష్టాలకు ఆ రెండు పార్టీలో కారణమన్నారు. ఈ పార్టీలు ప్రజలను గోల్ మాల్ చేశాయో తప్ప అభివృద్ధి పట్టించుకోలేదన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించే బాధ్యత తనది అన్నారు. ఉచిత నిర్బంధ విద్య అందిస్తామన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య ఉంటుందన్నారు.
కెసిఆర్ పైన జగ్గారెడ్డి ఆగ్రహం
కెసిఆర్ పైన సంగారెడ్డి కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. ుద్యమంలో చేసిన వసూళ్లు, కూడబెట్టిన ఆస్తుల వివరాలు బయటపెట్టాలన్నారు. కాంగ్రెసు పార్టీకి ఎవరితోను పొత్తు అవసరం లేదన్నారు. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. అవినీతిపై మాట్లాడే హక్కు కెసిఆర్కు లేదన్నారు.