సోనియాకి కోట్లు: దామోదరపై బాబుమోహన్ సంచలనం
హైదరాబాద్: మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోల్ అభ్యర్థి, ప్రముఖ నటుడు బాబుమోహన్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి దామోదర రూ.యాభై కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
మెదక్ జిల్లా సంగారెడ్డిలో బాబుమోహన్ విలేకరులతో మాట్లాడారు. ఆందోల్లో తాను ఓడిపోతానన్న భయంతో దామోదర సోనియా బహిరంగ సభ నిర్వహింప చేశారన్నారు. ఒకవేళ గెలిచే పరిస్థితులుంటే సోనియా సభను దామోదర పెట్టే వారు కారన్నారు. సోనియా సభ నిర్వహించిన చౌటుకూరు గ్రామంలోనే తనకు డెబ్బై శాతానికి పైగా ఓట్లు పడ్డాయన్నారు.
ఎన్కిల ప్రచారంలో దామోదర మరో రూ.50 కోట్లకు పైగా ఖర్చు పెట్టారన్నారు. ఈ లెక్కన వంద కోట్ల రూపాయలు దామోదర ఖర్చు చేశారన్నారు. అయినా తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో దామోదర కడప జిల్లాను మరిపించారని ఎద్దేవా చేశారు. తనను ఓడించడానికి రాజనర్సింహ రూ.100 కోట్లు పంచారని, అయినా ఆందోల్ ప్రజలు తనవైపే ఉన్నారన్నారు.
బంగారు తెలంగాణ తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోనే సాధ్యమన్నారు. సిఎంగా కెసిఆరే సమర్థుడన్నారు. తొలినాళ్లలో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించిందని, ఇప్పుడు తెరాస ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. తెలంగాణలో క్లీన్స్వీప్ చేస్తామన్నారు.