నాడు బాబు బినామీ నేడు సచ్చీలుడా... టీటీడీలో స్థానమా... జగన్ పై జనసేన ఫైర్
చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. ఇక ఈ విషయం వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం ఇరకాటంలో పెడుతోంది. నాడు నేడు పోస్టులతో జనసేన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. అప్పుడు అవినీతిపరుడు ఇప్పుడు సచ్చీలుడు ఎలా అయ్యాడు అని ప్రశ్నిస్తుంది.
సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదం .. సీఎంవో సీరియస్
నాడు శేఖర్ రెడ్డి బాబు బినామీ, అవినీతిపరుడు అని ఆరోపణలు చేసిన జగన్
ఒకప్పుడు శేఖర్ రెడ్డి బాబు బినామీ అంటూ టిటిడి బోర్డు మెంబర్ గా ఉన్న శేఖర్ రెడ్డి వందల కోట్ల అవినీతి సొమ్ముతో సిబిఐకి దొరికిపోయాడు అంటూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పోస్టు పెట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని 2004లో బాబు టిటిడి బోర్డు మెంబర్ గా నియమించారని చిత్తూరు జిల్లా ప్రజలు అంటున్నారని, టిటిడి బోర్డు లో బాబు బినామీలు చాలామందే ఉన్నారని నాడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు నేడు శేఖర్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇవ్వడంతో గుర్తు చేస్తోంది జనసేన.
నేడు అపనిందలు అధిగమించి అంటూ శేఖర్ రెడ్డికి కితాబు
ఇప్పుడు తిరిగి శేఖర్ రెడ్డి కి టిటిడి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న సమయంలో నాడు బాబు బినామీ అన్న శేఖర్ రెడ్డి కి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశమిచ్చి అపనిందలు అధిగమించి శ్రీ వారి చెంతకు వచ్చిన శేఖర్ రెడ్డి అని, శ్రీవారి సేవ చేయడానికి జీవితం అంకితం చేశారని పుంఖానుపుంఖాలుగా శేఖర్ రెడ్డి గొప్పతనం గురించి తమ పత్రికలో రాయడాన్ని ప్రశ్నిస్తుంది జనసేన.
ట్విట్టర్ వేదికగా నాడు .. నేడు పోస్టులతో జగన్ ని ప్రశ్నిస్తున్న జనసేన
ట్విట్టర్ వేదికగా నాడు-నేడు పోస్టులు పెట్టిన జనసేన ఒకప్పుడు బినామీ అని ఆరోపణలు చేసిన వ్యక్తిని జగన్ ప్రభుత్వంలో టీటీడీ లో చేర్చుకోవడం పట్ల విమర్శల వర్షం కురిపిస్తోంది . ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టి ఏకి పారేస్తోంది. నాడు ఆరోపణలు నేడు అధికార పదవులా అంటూ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు జగన్ చంద్రబాబు పార్టనర్ నా అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది . శేఖర్ రెడ్డి పై అప్పుడు ఆరోపణలు చేసి ఇప్పుడు టీటీడీ బోర్డులో స్థానం కల్పించటంపై ప్రశ్నిస్తున్న జనసేన రాజకీయ అవసరాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తాం అని ఒప్పుకుంటున్నారా వై ఎస్ జగన్ గారు? లేక మీ వాటాలు మీకు రాగానే వారు గొప్పవారు అయిపోతారా? అని నిలదీస్తుంది.
తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చిన శేఖర్ రెడ్డి
సోమవారం టీటీడీపాలక మండలి సభ్యుల సమావేశంతో తిరుమల చేరుకున్న రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక తనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఐటీ రైడ్స్ జరిగిన సమయంలో మా ఇంట్లో కేవలం 12 లక్షలు మాత్రమే దొరికాయి కానీ కావాలని తనపై తప్పుడు ప్రచారం చేశారని శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
ఇక ఇప్పటికైనా అసత్య ప్రచారాలను ఆపాలని ఆయన అన్నారు. అంతేకాదు తనపై వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవాలని చెప్పిన శేఖర్ రెడ్డి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని దేవుడే చూసుకుంటాడు అని వ్యాఖ్యానించారు. టిటిడి పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితునిగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
శేఖర్ రెడ్డి విషయంలో వైసీపీని ఇరకాటంలో పెడుతున్న జనసేన
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గతంలో ఆరోపణలు చేసి చంద్రబాబు బినామీ అని, అవినీతిపరుడు అని ముద్ర వేసి ఇప్పుడు సచ్చీలుడు అంటూ ఏకంగా టిటిడి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. జనసేన పార్టీ మాత్రం సోషల్ మీడియా వేదికగా నాడు నేడు పోస్టులతో వైసీపీ కి చుక్కలు చూపిస్తోంది.