దొంగే దొంగ అన్న చందంగా... దాడులు చేసేది మీరే యాత్రలు చేసేది మీరే అన్న మంత్రి బొత్సా
టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అటు టీడీపీ అధినేత చంద్రబాబు , టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని టీడీపీ నేతలు, కార్యకర్తల్ని దారుణంగా హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు . శాంతిభద్రతలు కాపాడుతామని నీతులు చెబుతూనే, మరోవైపు అనుకున్నది చేస్తున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకు యాత్ర చెయ్యనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఓదార్పు యాత్రపై మంత్రి బొత్సా సత్యన్నారాయణ విరుచుకుపడ్డారు.
ఏపీకి కేంద్రం మొండి చేయి: చంద్రబాబు హయాంలోలాగానే చిక్కుల్లో జగన్
చంద్రబాబు యాత్రలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందన్న బొత్సా సత్యన్నారాయణ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడుల్లో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారంటూ చంద్రబాబు ఆరోపించడాన్ని బొత్స ఖండించారు. వారు ఎలా చనిపోయినా నేరం వైసీపీపైన రుద్దుతున్నారని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో చనిపోయిన ఆరుగురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చాలంటూ చంద్రబాబు చేపట్టిన పరామర్శయాత్రలపై బొత్సా విమర్శలు గుప్పించారు . చంద్రబాబు యాత్రలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందని మంత్రి బొత్సా అభిప్రాయపడ్డారు. దాడులు చేసేది మీరే యాత్రలు చేసేది మీరే అంటూ చంద్రబాబుపై బొత్సా ఆగ్రహం వ్యక్తం చేశారు . దాడులు చేసి తమపై రుద్దుతారా అంటూ బాబుపై విరుచుకుపడ్డారు మున్సిపల్ మంత్రి బొత్సా సత్యన్నారాయణ .
అవినీతికి పాల్పడి ఇప్పుడు నీతి వ్యాఖ్యలు బోధిస్తున్నారని టీడీపీ నేతలపై బొత్సా ధ్వజం
ఇక అంతేకాక గత ఐదేళ్ల టీడీపీ పాలనలో టీడీపీ నేతలు హౌసింగ్ స్కీమ్ లో అవినీతికి పాల్పడి పేదల పొట్టకొట్టారని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలవాళ్ల సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడి మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రులు ఇప్పుడు నీతి వ్యాఖ్యలు బోధిస్తున్నారని ఎద్దేవా చేశారు బొత్సా . ఇక అసెంబ్లీ భవనాల నిర్మాణాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యన్నారాయణ.
ప్రణాళిక లేకుండా అసెంబ్లీ భవన నిర్మాణం చేశారని మండిపడిన మంత్రి బొత్సా
ఒక ప్రణాళిక అనేది లేకుండా అసెంబ్లీ భవనాలను నిర్మించారని బొత్స అభిప్రాయపడ్డారు. ఎలాంటి వసతులు లేకుండా , సందర్శకులకు కనీస మౌలిక సదుపాయాలూ కూడా లేకుండా నిర్మించారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో ఛాంబర్ల మార్పు, వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్ లో మున్సిపల్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు బొత్స సత్యన్నారాయణ.