జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వరా: ఆ మతానికి చెంది..అతీతుడా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీకి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు తాజాగా ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు అందించిన అంశం పైనా మాట్లాడారు. ఆ సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. క్రైస్తవ మతానికి చెందిన జగన్ మొన్న స్వామి వారికి పట్టువస్త్రాలు పంపిణీ చేయడానికి వెళ్లి ఎలాంటి డిక్లరేషన్పై సంతకం చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. ఆయన ఏమైనా అతీతుడా అని ప్రశ్నించారు.
అదే విధంగా గతంలో తిరుమలలో పింక్ డైమండ్ మాయం చేసారనే ఆరోపణలను గుర్తు చేసారు. ఇప్పుడు దాని గురించి ఏం చేసారని నిలదీసారు. దీని పైన పరువు నష్టం దావా వేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. అయితే..ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు రాజకీయంగా చర్చ మొదలైంది.
సోషల్ మీడియా వేదిక చేసుకొని వేధింపులు, జగన్పై చంద్రబాబు విమర్శలు
జగన్ పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
గతంలో రాజశేఖరెడ్డి పైనా...ఇప్పుడు జగన్ పైనా టీడీపీ నేతలు ఒకే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. క్రైస్తవ మతానికి చెందిన జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు అందించిన సమయంలో డిక్లరేషన్ పైన సంతకం చేయలేదనే విషయాన్ని ప్రస్తావించారు. గతంలోనూ పలు మార్లు టీడీపీ నేతలు ఇదే రకంగా వ్యాఖ్యలు చేసారు. అయితే..జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అక్కడి సంప్రదాయలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో వైయస్సార్ సైతం శ్రీవారిని భక్తుడిగా కొలిచేవారని..ఇప్పుడు జగన్ సైతం ప్రతీ పనికి ముందు శ్రీవారిని దర్శనం చేసుకున్న తరువాతనే ఆరంభిస్తున్నా రని చెప్పుకొస్తున్నారు.
జగన్ సైతం
నాడు వైయస్సార్ ఇదే విధంగా ముఖ్యమంత్రిగా శ్రీవారికి పట్టు వస్త్రాలు అందించారని..అయిదేళ్ల పాటు అదే విధానం కొనసాగించారని గుర్తు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ సైతం అక్కడి పద్దతులను పాటిస్తూ సీఎం హోదాలోనే పట్టు వస్త్రాలు సమర్పించారని చెబుతున్నారు. శ్రీవారి ముందు ఎవరూ అతీతులు కాదని.. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదన్నది వైసీపీ నేతల వాదన. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అసలు తిరుమలలో ఏం జరిగింది...జగన్ నిబంధనలను ఉల్లఘించారా..ఇవి రాజకీయ ఆరోపణలా అనే చర్చ మొదలైంది.
పింకడ్ డైమండ్ వ్యవహారం పైనా..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలలో పింక్ డైమండ్ మాయమైందంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పింక్ డైమండ్ వియషంలో చంద్రబాబు పైన ఆరోపణలు చేసారు. పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆ వ్యవహారం రాజకీయంగా దుమారానికి కారణమైంది. అయితే..అప్పట్లోనే టీటీడీ ఈవో దీని పైన స్పష్టత ఇవ్వటం ద్వారా వివాదం సద్దుమణిగింది. ఇక, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావటంతో పింక్ డైమండ్ వ్యవహారం తేల్చాలని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పుడు టీటీడీ అధికారులు పింక్ డైమండ్ అసలు లేదని చెబుతున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. తన పైన తప్పుడు ఆరోపణలు చేసిన వారి పైన పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
చిన్నాన్న మరణించిన ఏడాది లోగా ఎలా..
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే..సొంత చిన్నాన్న వివేకా మరణించి ఏడాది కాలేదని..రక్త సంబంధీకులు మరణిస్తే ఏడాది వరకు దేవుడికి సంబంధించిన పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనకూడదనే చర్చ సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే, ముఖ్యమంత్రి మాత్రం ఏడాది పూర్తి కాకుండానే శ్రీవారికి పట్టు వస్త్రాలు అందించటం సరైనదేనా అనే చర్చ సైతం తీసుకొచ్చారు. ఒక వైపు బీజేపీ మత పరమైన అంశాలతో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుండగా.. మరోవైపు టీడీపీ సైతం ఇటువంటి అంశాలను ప్రస్తావించటం ద్వారా జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో..అసలు వీటిలో ఏవి నిజం..ఏం జరుగుతోందనే చర్చ రాజకీయంగా సాగుతోంది.