కాళీమాత సాక్షిగా కోల్కతాలో కాషాయం కుట్రలన్న బాబు..! ఖండిచిన బీజేపి నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : కోల్కతాలో బీజేపి దాడులను ఖండిస్తున్నట్టు టీడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమన్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు అసలు రంగులు చూపిస్తూ బీజేపి ప్రత్యక్ష దాడులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. మోదీ, అమిత్షా చేస్తోన్న విధ్వంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపుతూ అమిత్ షా చర్యలను ఖండిస్తున్నట్టు ట్విటర్లో పేర్కొన్నారు.
కోల్కతాలో బీజేపీ దాడులను ఖండించిన చంద్రబాబు..! గట్టి కౌంటర్ ఇచ్చిన షా..!!
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. అమిత్ షా ర్యాలీ నేపథ్యంలో నిన్న బంగాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే బాధ్యత. రాష్ట్రంలో తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. అక్రమంగా పోలింగ్ బూత్ల్లోకి చొరబడి దుశ్చర్యలకు దిగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కేవలం పశ్చిమబెంగాల్లోని 42 సీట్లలోనే పోటీ చేస్తుంది.
హింసాత్మక ఘటనలు..! తృణమూల్ కాంగ్రెసే బాధ్యత అన్న అమీత్ షా..!!
గత ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్లో జరిగినట్లుగా ఏ రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరగలేదు. దీనికి తృణమూల్ కాంగ్రెసే బాధ్యత వహించాలి అని అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మంగళవారం కోల్కత్తాలో రోడ్ షో నిర్వహించగా.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. షా రోడ్ షోకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. అమిత్ షా కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు.
రాజకీయాలు కలుషితమయ్యాయి..! మమతపై క్రిమినల్ కేసు పెట్టాలన్న కన్నా..!!
మోదీ ప్రభంజనాన్ని అడ్డుకొనేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్లో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. కోల్కతాలో అమిత్ షా ర్యాలీపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేశారు. మమత బెనర్జీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మమతాను సమర్థిస్తున్న చంద్రబాబుపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు.
బీజేపీ నేత మురళీధర్రావు ఫైర్..! బాబు వ్యాఖ్యలు సరైనవి కావన్న బీజేపీ నేత..!!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు స్వయంకృతాపరాధాలే ఆయన ఓటమికి కారణం అవుతాయని బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాకపోతే బలోపేతం అయ్యేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఇక దేశ వ్యాప్తంగా మోదీకి ప్రత్యామ్నాయం కనిపించే పరిస్థితి లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప.. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఈసారి కూడా 280కి పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ 75 స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవన్నారు. మే 23 తర్వాత చంద్రబాబుతో సహా బీజేపి వ్యతిరేకులందరికి మేఘాలు విడిపోతాయని చెప్పుకొచ్చారు.