వీడియో : బంధువని వచ్చి పసిబిడ్డను ఎత్తుకెళ్ళిన మహిళ; సీసీ టీవీలో దృశ్యాలు, మచిలీపట్నంలో ఘటన
అభం శుభం తెలియని,పసికందులు అపహరణలకు గురవుతున్న ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది . చిన్నారుల అపహరణలపై ఆసుపత్రి వర్గాలను ఎంతగా అలర్ట్ చేస్తున్నా ఎక్కడో ఒకచోట నిత్యం పసికందుల అపహరణ కొనసాగుతూనే ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు కాస్త ఏమరపాటుగా ఉన్నా ఆసుపత్రుల నుండి చిన్నారులను అపహరించుకుపోతున్న ఘటనలు తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురం వైద్యశాలలో చిన్నారి అపహరణ ఘటన చోటు చేసుకోగా తాజాగా మచిలీపట్నంలో మళ్ళీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో వారం రోజుల పసికందు మాయం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వారం రోజుల పసికందు ఆసుపత్రి నుండి అపహరణకు గురైంది. మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన ఈ సంఘటన ఆసుపత్రి వర్గాలను షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే వారం రోజుల క్రితం పెదమద్దాలి కి చెందిన ప్రత్తిపాటి ఇంద్రజ అనే మహిళ ప్రసవం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం సాయంత్రం భర్త తరపు బంధువును అంటూ ఓ మహిళ ఇందుజాను పలకరించడానికి ఆసుపత్రికి వచ్చింది. మరుసటి రోజు వెళతాను అంటూ ఆ రాత్రి ఆసుపత్రిలోనే ఇందుజతో పాటు ఉన్న సదరు మహిళ శనివారం ఇందూజ ఆస్పత్రి ప్రాంగణంలో వాకింగ్ చేస్తున్న క్రమంలో భర్త తరపు బంధువును అని చెప్పి అదును కోసం ఎదురు చూస్తున్న గుర్తు తెలియని మహిళ పసిబిడ్డను ఎత్తుకుని ఉడాయించింది.
వార్డులో శిశువు మాయం .. బంధువుగా వచ్చిన మహిళే ఎత్తుకెళ్ళిందన్న తల్లి
ఇక వార్డులోకి వెళ్లి చూసేసరికి శిశువు కనిపించకపోవడంతో, భర్త తరపు బంధువును అని చెప్పిన మహిళా కనిపించకపోవడంతో ఇందుజాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమెనే బిడ్డను అపహరించిందని లబోదిబోమన్నారు. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పసికందు కోసం గాలింపు చేపట్టారు. పసికందుతో పరారైన మహిళను పట్టుకోవడం కోసం సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. సిసిటివి ఫుటేజీ ఆధారంగా మహిళ జాడ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
భర్త తరపు బంధువని మోసం.. తెలుసుకోలేకపోయిన శిశువు తల్లి
అయితే ఈ కేసులో గుర్తు తెలియని మహిళ భర్త తరపు బంధువు అని చెప్పి వచ్చి ఉంటే, అది నిజమా కాదా అని తెలుసుకోకపోవడం, ఆసుపత్రిలో పసికందును ఒంటరిగా వదిలి వెళ్లడం ఆ తల్లికి కడుపు శోకాన్ని మిగిల్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కానీ డెలివరీకి వెళ్ళిన సమయంలో పసిబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.ఎప్పుడూ ఎవరో ఒకరు ఆ బిడ్డలకు కాపలాగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా ఇలాంటి మాయలేడీలు బిడ్డలను మాయం చేసి, శిశు విక్రయాలకు పాల్పడతారు. బిడ్డల సంరక్షణ బాధ్యత జాగ్రత్తగా నిర్వహిస్తే ఇలాంటి పరిణామాలు ఎదురుకాకుండా ఉంటాయి.
సీసీ టీవీ ఫుటేజ్ లో శిశువును ఎత్తుకెళ్ళిన దృశ్యాలు
పాప అదృశ్యం నేపథ్యంలో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక మహిళ పాపను ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. పాపను ఎత్తుకుని చకచకా సదరు మహిళ బయటకు వెళ్తున్న దృశ్యాలు సిసి టీవీ ఫుటేజ్ లో లభించాయి. ఆమె ఎటు వెళ్ళింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తన బిడ్డను తనకు ఇప్పించాలని తల్లి కన్నీరు మున్నీరుగా రోదిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో పాపని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు నమోదైన నేపథ్యంలో సదరు మహిళను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.
నాలుగు ప్రత్యే బృందాలతో గాలింపు.. పాపను అపహరించింది ఎవరు?
శిశు విక్రయాల కోసం బంధువునని చెప్పి వచ్చిన మహిళ ఈ దురాగతానికి పాల్పడిందా ? ఇంతకీ ఆ మహిళ ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం శిశువు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, పుట్టిన వారం రోజులకే బిడ్డ దూరం కావడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. తన బిడ్డ తిరిగి తన చెంతకు చేరుతుందో లేదో అన్న ఆవేదనలో ఆ తల్లి బోరున విలపిస్తుంది.