ఆ ఘనత టీడీపీదే, ఎన్టీఆర్ అలా.. నేనిలా: బాబు, తాతతో దేవాన్ష్ సందడి(పిక్చర్స్)
అమరావతి: అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ దళితులకు అండగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ బాటలో అడుగులు వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అంబేద్కర్ ఆశయాల అమలుకు అహరహం కృషి చేసే పార్టీ తెలుగుదేశమేనని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చెప్పారు.
దావోస్ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన దళిత తేజం- తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ దళితుల కోసం కాంగ్రెస్గానీ, వైయస్ రాజశేఖరరెడ్డి గానీ చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. అంబేద్కర్ను కాంగ్రెస్ విస్మరిస్తే టీడీపీనే ఆయన గౌరవాన్ని జాతీయస్థాయిలో కాపాడిందన్నారు.
ఆ ఘనత మాదే
కాంగ్రెస్ పాలకులు చివరకు ఎస్సీ కార్పొరేషన్ను కూడా నిర్వీర్యం చేసి, దానిని రద్దుచేసే వరకూ వెళ్లారని.. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ నాయకులు దళితుల గురించి మాట్లాడటం వింతగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. లోక్సభ, అసెంబ్లీ స్పీకర్లుగా దళితులను నియమించిన ఘనత తమదేనని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ అలా.. నేనిలా..
‘నేను అందరినీ చేయూతనిస్తా. అన్ని విధాలుగా ఆదుకుంటా. దళితులు అన్ని విధాలుగా పైకి వచ్చేవరకూ వారికి దన్నుగా నిలుస్తా. ఈ కార్యక్రమంతో మీరు దళితుల వద్దకు వెళ్లి మనం చేసిన పనులు చెప్పండి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని దళితులలో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత మీదే' అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జనాభా దామాషాన రిజర్వేషన్లు ఇస్తే, తాను ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించానని, దళితుల సంక్షేమంలో తమకు మరొకరు పాఠాలు నేర్పవలసిన పనిలేదని వ్యాఖ్యానించారు.
జన్మధన్యమైంది..
‘ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ఈ రోజు నా జన్మ ధన్యమయ్యింది, రిపబ్లిక్ డే రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ఒకటే చెప్పారు. బడుగు, బలహీన వర్గాల వారే పార్టీకి పునాది అని. నాకు అంబేద్కర్ స్ఫూర్తి, జగ్జీవన్రావుతో కలిసి పనిచేసింది మన నాయకుడు ఎన్టీఆర్. అంతకు ముందు ఎవ్వరూ కూడా అంబేద్కర్ను, జగ్జీవన్రావుని గౌరవించలేదు. నాయకులకు సరైన గుర్తింపు కూడా ఇవ్వలేదు. జగ్జీవన్ రావుకి భారతరత్న ఇచ్చింది ఎన్డీయే ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ కాదు. బాలయోగిని లోక్సభ స్పీకర్ను చేశాం. మొట్టమొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా మహేంద్రనాథ్ని తెలుగుదేశం పెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. షెడ్యూల్డు కులాల కోసం నిరంతరం శ్రమిస్తాం. దళితులు ఐక్యంగా ఉండాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
దళితుల కోసం ఎన్నో కార్యక్రమాలు
‘చంద్రన్న పెళ్లి కానుక ద్వారా రూ.40 వేల సహాయం చేస్తాం. బ్యాక్లాగ్ పోస్టులన్నీ పూర్తి చేశాం. రూ.9,500 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దళిత పిల్లల పోటీ పరీక్షలకు సహాయం చేస్తాం' అని చంద్రబాబు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 20 మంది చొప్పున ప్రతినిధులు ఉంటారని, అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్సీ పిల్లలను పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఎక్కడా అన్యాయం జరగదని హామీ ఇస్తున్నానని చంద్రబాబు చెప్పారు.
టీడీపీ మాత్రమే..
దళితుల కోసం అప్పటి ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి వారికి పంపిణీ చేయలేదు. కానీ 10 సంవత్సరాల తరువాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఖర్చు చేసి భూములు కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. దేశంలోనే దళితులకు 75 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. సమావేశంలో మంత్రి నక్కా ఆనందబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్కుమార్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా దేవాన్ష్
దళితతేజం కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబుతో కలిసి ఆయన మనవడు దేవాన్ష్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగే సమయానికి దేవాన్ష్ని తీసుకుని సహాయకురాలు అక్కడికి వచ్చారు. చంద్రబాబు మనవడిని వెంట తీసుకునే దర్బార్ హాల్లోకి వచ్చారు. తన ఒడిలోనే కూర్చోబెట్టుకున్నారు. పోస్టర్, కరపత్రం ఆవిష్కరించినప్పుడు వాటి ప్రతుల్ని దేవాన్ష్కి అందజేశారు. తాను ప్రసంగించే సమయంలో... దేవాన్ష్ను ఆయన తన కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. కాగా, శుక్రవారం జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కూడా దేవాన్ష్ పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే.