ఎన్టీఆర్ ఇలాకాలో వైయస్ జగన్కు చేదు అనుభవం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని స్వర్గీయ ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చేదు అనుభవం ఎదురైంది. అత్యంత గోప్యంగా నిమ్మకూరు చేరిన జగన్ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీ రామారావు అభిమానులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.
జగన్ పూలమాల వేస్తే తాము ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో జగన్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాగా, జగన్ ఎన్టీ రామారావు బంధువు నందమూరి పెద వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లారు. తమ పార్టీలో చేరాలని జగన్ పెద వెంకటేశ్వర రావును కోరారు.
స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులతో నందమూరి పెద వెంకటేశ్వర రావుకు విభేదాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని వాడుకోవడానికి వైయస్ జగన్ సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, వైయస్ జగన్ నిమ్మకూరు పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు.
అయితే, జగన్ నిమ్మకూరు వచ్చినట్లు ఆ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక్కసారిగా గుప్పుమంది. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున నిమ్మకూరు వచ్చారు. చిగురుపాటి బాబూరావు కుటుంబ సభ్యులకు మాత్రమే జగన్ రాక గురించి తెలుసునని అంటున్నారు.