బ్యాడ్ లక్:ఎంసెట్ పాస్,ఇంటర్ ఫెయిల్...11,237 మంది విద్యార్థులు
అమరావతి:దురదృష్టం అంటే వీళ్లదే...క్లిష్టమైన ఎంసెట్ లో అలవోకగా ఉత్తీర్ణత సాధించిన వీళ్లు ఇంటర్ పరీక్షలో ఫెయిలవడం కొంపముంచేసింది. విచిత్రంగా ఇలాంటి విద్యార్థులు వేలాది మంది ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇలా ఎంసెట్ పాసై ఇంటర్ ఫెయిలైన వాళ్లు ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 11,237 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. బుధవారం వెలువడిన ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో రిజల్ట్ చూసుకున్న వీరు అందులో పాసవడం చూసి మరింత ఆవేదనకు గురయ్యారు. అదెలాగంటే వీరు ఇటీవలే విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఆల్రెడీ ఫెయిలై ఉండటమే కారణం.
ఇంటర్ లో కూడా పాసై ఉంటే తాము కూడా చక్కగా ఇంజనీర్, డాక్టర్ అయ్యేవాళ్లమని, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా క్లిష్టమైన ఎంసెట్ అధిగమించి అర్హత సాధించినా సాధారణమైన ఇంటర్మీడియట్ లో పాస్ కాలేకపోయామని మథనపడుతున్నారు. ఇలా ఇంటర్ ఫెయిలై ఎంసెట్ అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగంలో 8,569 మంది ఉండగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 2,668 మంది ఉన్నారు.
వీరందరూ ఇంటర్లో ఉత్తీర్ణత కానందున ప్రస్తుతానికి ఎంసెట్ ర్యాంకులకు దూరమయ్యారు. అయితే వీరందరికీ ఊరట కలిగించే అంశం ఒకటుంది. అదేమిటంటే త్వరలో జరగబోయే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం. అలా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కూడా ఎంసెట్ ర్యాంకులు కేటాయిస్తారు. కాబట్టి అలా ఎంసెట్ అవకాశాన్ని చేజారనీయకుండా ఒడిసిపట్టుకునే అవకాశం వీరందరికీ ఇంకా మిగిలేవుంది.