ఎపికి కేంద్రం బ్యాడ్ న్యూస్ లు: ఎన్ఐడిఎం ఇవ్వలేం...విశాఖ రైల్వేజోన్ సాధ్యపడదు
Recommended Video
ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి ఎపి ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. వాటిలో ఒకటి విశాఖ రైల్వే జోన్ సాధ్యపడని తేల్చి చెబుతుండగా...మరొకటి విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడిఎం) మీ రాష్ట్రానికి ఇవ్వలేమనడం...వివరాల్లోకి వెళితే...
విశాఖ రైల్వేజోన్ కు సంబంధించి ఈ ప్రాజెక్ట్ సాధ్యపడదని ఇప్పటివరకు వచ్చిన కమిటీ నివేదికలు చెప్పాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఐతే, ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మరో వైపు వివిధ కారణాల రీత్యా ఎన్ఐడీఎం సంస్థను మీ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేమని ఎపి ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం.
విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కు...నీళ్లు వదిలేసుకోండి
విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ మనుగడ సాధ్యపడదని ఈ ప్రాజెక్టు విషయమై అధ్యయనం చేసిన రైల్వే టెక్నికల్ కమిటి నివేదిక తేల్చి చెప్పినట్లు కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కి ఈ బడ్జెట్ ముందైనా మోక్షం కలిగే అవకాశం ఉందా?...అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ...బడ్జెట్ తో విశాఖ రైల్వే జోన్ కి సంబంధం లేదన్నారు. అయినా 99 శాతం జోన్ వస్తుందనే అశిస్తున్నామని, ఈ విషయమై కేంద్రంపై ఒత్తడి తీసుకువస్తున్నట్లు సుజనా చౌదరి వివరించారు.
ఎన్ఐడీఎంపై...మాట తప్పుతున్న కేంద్రం...విభజన హామీకి గండి
కేంద్రం ఎపికి సంబంధించి మరో చట్టబద్ధమైన హామీని గంగలో కలిపేస్తున్నట్లు తాజా సమాచారం తేటతెల్లం చేస్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) దక్షిణాది ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో విస్పష్టంగా పేర్కొనగా...ఇప్పుడు వివిధ "ఇతరత్రా కారణాల"రీత్యా ఈ కేంద్రాన్నిమరో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని కేంద్రం నుంచి అనధికార వర్తమానం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
స్థలం కూడా కేటాయించి...ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో...
విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్లో అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలను వదులుకుని వచ్చిన నేపథ్యంలో ...నవ్యాంధ్రప్రదేశ్ లో పలు జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలు ఏర్పాటు చేస్తామని కేంద్రం అప్పట్లో ప్రకటించింది. అలాగే విభజన చట్టంలో ఆయా అంశాలను పొందుపరిచింది. అలా పొందుపరిచిన సంస్థల్లో ఎన్ఐడీఎం కూడా ఒకటి. తరచూ వరదలు సంభవించే మన రాష్ట్రంలో ఎన్ఐడీఎం అవసరం ఉంది. ఈ సంస్థ ఆవశ్యకత ప్రాధాన్యతను గుర్తించే ఎపి ప్రభుత్వం అమరావతిలో ఎన్ఐడీఎం కోసం పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది.
చివరికిలా...చావు కబురు చల్లగా...
ఎన్ఐడీఎం భవన నిర్మాణాల ఏర్పాటు కోసం ఎపి ముందస్తుగానే అన్ని వసతులు కూడా కల్పించిందని చెబుతున్నారు. కానీ...ఇప్పుడు...ఈ దశలో...కేంద్రం చావు కబురు చల్లగా చెప్పినట్లు, ‘ఎన్ఐడీఎంను మీ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేం' అంటూ సమాచారం పంపిందని తెలిసింది. దీంతో ఎపికి సంబంధించి...రెవెన్యూ లోటు భర్తీ విషయం నుంచి మొదలైన ఈ "మాట తప్పడం"...ప్రత్యేక హోదాపై వాగ్ధాన భంగంతో పతాక స్థాయికి చేరింది.
మరిన్ని...ఆశాభంగాలు...
ఇదే క్రమంలో ఎపికి వివిధ జాతీయ సంస్థలను కేటాయించినా...వాటి నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు అందించకపోవడం...ఇప్పుడు... ఎన్ఐడీఎం...విశాఖ ప్రత్యేక రైల్వే జోన్...విషయాల్లోనూ కేంద్రం మొండిచేయి చూపుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వం...ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.