బద్రి అంతిమయాత్ర: భర్తను చూసి బోరుమన్న భార్య
విజయవాడ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్ బద్రి అంతిమయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య లక్ష్మీసుజాతకు బంధువులు బద్రి మృతదేహాన్ని చూపించడంతో ఆమె బోరున విలపించారు.
ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ బద్రి అంతక్రియలు ఆయన సొంతూరులో ముగిశాయి. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో పలువురు మంత్రులు బద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా బద్రి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పల్లె రఘునాథరెడ్డి రూ. లక్ష, రూ. 20వేలు బద్రి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు.
ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో టీవీ9 చానెల్ న్యూస్ రీడర్ బద్రి మృతి చెందిన విషయం తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీసుజాత కూడా గాయపడ్డారు. బద్రి పెద్దకుమారుడు సాయి సందీప్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని వెంటలేటర్పై ఉంచినట్లు సమాచారం. ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మరణించగా, చిన్న కుమారుడు సాయి సాత్విక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
లక్ష్మీసుజాత చెయ్యి విరగడంతోపాటు ఆమె వెన్నుపూస వద్ద బలమైన గాయమైంది. ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెదడుకు దెబ్బ తగిలి, పుర్రె ఎముక ఫ్రాక్చర్ కావడంతో పెద్ద కుమారుడికి వెంటిలేటర్పై చికిత్సనందిస్తున్నారు. బద్రి బావమరిది గండ్రోతు తారక్కు కూడా తీవ్రగాయాలు కావడంతో విజయవాడ ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
బద్రి అమ్మమ్మ ఊరు ఆవపాడు. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత తండ్రి ఉద్యోగ రీత్యా ఉంగుటూరులో నివాసం ఉన్నారు. ఆ తరువాత విజయవాడలో స్థిరపడ్డారు. ఆవపాడులోని మేనమామ కుమార్తె లక్ష్మీసుజాతను వివాహం చేసుకున్నారు.