గబ్బర్ సింగ్ గ్యాంగ్ ను టార్గెట్ చేస్తున్న బాహుబలి సైన్యం..! ఏపి రాజకీయాల్లో విచిత్ర మలుపు..!!
అమరావతి/హఐదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కింది. ఇక్కడ రాజులు, కాపులు ఎక్కువ. రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఇక్కడినుండి వచ్చిన వారే. అందుకే వారికి ఇక్కడ అభిమానులు ఎక్కువ. వీరి ఫాన్స్ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీయే విజయం సాధించడం సర్వసాధారణంగా జరుగుతుంది. అలాగే ఇక్కడి జనం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఒకటి సినిమాలకు. రెండు రాజకీయాలకు. తమకు ఇష్టమైన హీరోలు రాజకీయాల్లో కీలకం అయితే ఆ మజానే వేరు. ప్రస్తుతం ఏపీలో ఇలాంటి పరిస్థితే ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో 2019 ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
జనసేనలో ఏక్ నిరంజన్ కలవరం..! డార్లింగ్ ఎవరికి మద్దత్తిస్తాడన్న అంశంపై ఉత్కంఠ..!!
గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిన గబ్బర్ సింగ్ ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. పవర్ స్టార్ నుండి జనసేన అధినేతగా మారిన పవన్ కళ్యాణ్, ఏపీలోని గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకతో సానుకూలమైన పవనాలు ఉన్నప్పటికీ భీమవరంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అధికార, ప్రతిపక్షపార్టీలను నుండి గట్టిపోటీతో పాటు.. కులసమీకరణాలు కూడా ఇక్కడ కీలకంగా మారాయి. ఈ సందర్భంలో వివిధ హీరోల అభిమాన సంఘాలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపిస్తుండటం జనసైనికుల్లో కలవరం మొదలైంది.
భీమవరంలో త్రిముఖపోరు..! రాజుల సామాజిక వర్గం ఎటువైపు..!!
గత ఎన్నికల్లో ఇక్కడ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా రామాంజనేయులు వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు పవన్ రాకతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ నుండి రామాంజనేయులు, వైసీపీ తరపున గ్రంధి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ వున్నారు. ఈమధ్యే భీమవరంలో సినీ అభిమానుల సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోల అభిమాన సంఘాలు పాల్గొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణం రాజుకు పారిశ్రామిక వేత్తగానే కాకుండా, సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండటంతో, ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
క్రిష్ణం రాజుతో మెగా కుటుంబానికి సత్సంబందాలు..! మరి ఈభిమానులు ఎటువైపు..?
ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న ప్రభాస్ అభిమానులు, వైసీపీకి మద్దతు ప్రకటించినట్టు చర్చ జరుదుతోంది. మొదట్లో ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలవాలనే ప్రతిపాదనను సమర్ధించారట. అయితే రఘురాం కృష్ణం రాజు వైసీపీలో చేరడం, అక్కడ రాజుల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో, సమీకరణాలు పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. మొదట్లో పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలనుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు వైసీపీకి మద్దతు ప్రకటించారట. భీమవరంలో ప్రభాస్కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉండటంతో ఆ ప్రభావం ఎంత వరకూ పనిచేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
రాజులు మద్దత్తిచ్చిన పార్టీ విజయం..! కాటమరాయుడు పరిస్థితి ఏంటి..!!
ఇక ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు బీజేపీలోనే కొనసాగుతుండగానే, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వైసీపీకి మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. కృష్ణం రాజు, చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు పార్టీ తరపున పోటీ చేసారు. చిరంజీవి మీద ఇష్టంతో కృష్ణం రాజు పవన్ కు మద్దతు ఇస్తాడని జనసేన వర్గాలు అంటున్నాయి. కాగా ఇటీవల ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో పాటు కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ జనసేనలో చేరిపోయారు. వారి ప్రభావం ఎంత వరకూ పనిచేస్తుందో చూడాలి. మొత్తానికి బాహుబలి, కాటమరాయుడిని రాజకీయంగా కలవరపెడుతున్నట్టు ఉత్తరాంధ్రలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.