ఫిబ్రవరి 14న తిరగొద్దు: లవర్స్కు బజరంగ్దళ్ వార్నింగ్
హైదరాబాద్: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు పోస్టర్ విడుదల చేశారు. తాము ప్రేమకు మేం వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజు పేరిట భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మంటగల్పే చర్యలకే తాము వ్యతిరేకమని, దేశ సంస్కృతిపై పాశ్చాత్య సంస్కృతి దాడిని నిరసిస్తూ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ప్రేమికుల రోజును బహిష్కరిస్తున్నామని దళ్ చెప్పింది. ఫిబ్రవరి 14న ప్రేమ జంటలు పార్క్లు, పబ్, రిసార్ట్ల వెంట తిరగవద్దని హెచ్చరించింది.
అలాగే ప్రేమ జంటలకు పెళ్లిలు చేయడం తమ విధానం కాదని, ఈసారి ఫిబ్రవరి 14న పార్క్ల వద్ద కనిపించే జంటలను విహెచ్పి కార్యాలయానికి తీసుకెళ్లి తల్లిదండ్రులు, పోలీసులు, న్యాయశాఖ, మీడియా ఎదుట కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇరువర్గాల పెద్దలు ఒప్పుకుంటే ఆ జంటలకు పెళ్లిళ్లు చేస్తామని చెప్పారు. నగరంలోని విహెచ్పి కార్యాలయంలో ఆదివారం విహెచ్పి, బజరంగ్ దళ్ల ఆధ్వర్యంలో ప్రేమికుల రోజుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సులో విహెచ్పి ప్రచార ప్రముఖ్ హెబ్బార్ నాగేశ్వర రావు, అధికార ప్రతినిధి వెంకటేశ్వ రాజు, బజ్రంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ భాను ప్రకాష్, గ్రేటర్ హైదరాబాద్ మీడియా కన్వీనర్ భరత్ వంశీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ పరాయి దేశాలు బహిష్కరించిన ప్రేమికుల రోజును దేశ యువత ప్రత్యేక దినంగా జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రేమకు తాము వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజు పేరిట దేశ భవిష్యత్ను, చరిత్రను నాశనం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తమ వ్యాపార లావాదేవీల కోసం దేశ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి పరాయి శక్తుల చేతిలో దేశ యువత బలి పశువులు కావొద్దని సూచించారు. బజరంగ్ దళ్ సభ్యులు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతిని వంట బట్టించుకుని దేశ సంస్కృతి, సంప్రదాయాలను నిర్వీర్యం చేస్తున్న ప్రేమికుల రోజును నిషేధిసున్నామన్నారు. ఫిబ్రవరి 14న ప్రేమ జంటలను ఆకర్శించేలా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించే పబ్లు, రిసార్ట్లు, క్లబ్ల చర్యలను సహించమన్నారు. అవసరమైతే దాడులకు వెనకాడమని హెచ్చరించారు.