రేపు రెడ్ హిల్స్ ఫామ్హౌస్లో బాలు అంత్యక్రియలు... ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో...
భారతీయ దిగ్గజ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏ గాయకుడికి సాధ్యం కాని రీతిలో అనేక మాడ్యులేషన్స్లో బాలు తన గాత్రాన్ని పలికించి అభిమానులను మైమరపింపజేశారు. కేవలం ఆయన పాటలతోనే హిట్టయిన సినిమాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన పాటల ప్రవాహంలో ఎన్నెన్నో మధురమైన గీతాలు. బాలు భౌతికంగా దూరమైన ఆ పాటల రూపంలో ఎప్పుడూ బతికే ఉంటాడు. ఆ వినసొంపైన గాత్రం అభిమానుల చెవుల్లో ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది.
ఆ గొంతు మూగబోయింది: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు..!
కరోనా బారినపడటంతో గత 50 రోజులుగా బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం(సెప్టెంబర్ 25) ఆయన కన్నుమూశారు. బాలు తిరిగొస్తారని... తిరిగి రావాలని కోట్లాదిమంది ఆకాంక్షించినప్పటికీ చివరకు మృత్యువు ఆయన్ను తీసుకెళ్లిపోయింది. స్థానిక అధికారులు బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సత్యం థియేటర్ వద్దకు తరలించనున్నారు. అనంతరం నేటి సాయంత్రం 4గంటలకు చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్లో ఉన్న ఆయన నివాసానికి తరలిస్తారు. శనివారం ఉదయం వరకు ఆయన భౌతిక కాయం అక్కడే ఉంటుంది. అనంతరం ఆపై చెన్నై శివారు రెడ్హిల్స్లోని ఆయన ఫామ్హౌస్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసిన చేసిన అంతిమయాత్ర రథంలో బాలు భౌతిక కాయాన్ని ఫామ్ హౌస్కు తరలించనున్నారు.