బాలయ్య పీఏ దోషే.. మూడేళ్ల జైలు, రూ.3 లక్షల జరిమానా
అనంతపురం : ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షాక్ తగిలింది. బాలకృష్ణ పీఏ శేఖర్కు కోర్టు జైలు శిక్ష విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు రుజువయ్యాయి. దీంతో శేఖర్కు కోర్టు మూడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.3లక్షలు జరిమానా విధించింది. బాలయ్య పీఏ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడం ఇటు సినీ ఇండస్ట్రీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది.
ఇదీ విషయం ..
తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పనిచేస్తున్న శేఖర్ క్రమంగా రాజకీయాల వైపు మళ్లాడు. తనకున్న పరిచయాలతో బాలకృష్ణకు దగ్గరయ్యారు. ఆయన వద్దపర్సనల్ అసిస్టెంట్గా చేరారు. కానీ తన బుద్ధిని మాత్రం పోనివ్వలేదు. ఎమ్మెల్యేగా గెలిచాక తర్వాత బాలయ్య సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో శేఖర్ మకాం వేశాడు. ఇంకేముంది ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ పార్టీ నేతలు కూడా పలు సందర్భాల్లో మండిపడ్డారు. ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
అంతేకాదు తనతో సఖ్యంగా లేనివారి గురించి బాలకృష్ణకు చెడుగా చెప్పేవారు శేఖర్. దీంతో ఇంటా, బయట శేఖర్పై ఆరోపణలు తీవ్రతరం కావడంతో తన పీఏగా తప్పించారు. తర్వాత అతనిపై కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడురోజుల కింద నెల్లూరు ఏసీబీ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇవాళ శిక్ష కాలం, జరిమానాను వెల్లడించింది. మూడేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల నగదు జరిమానా విధించింది.