News makers: ధర్మాడి సత్యం: సామాన్యుల్లో అసామాన్యుడు: నౌకాదళం చేతులెత్తేసిన చోట..!
రాజమహేంద్రవరం: ధర్మాడి సత్యం. ఈ ఏడాది చివరి మూడు నెలల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగినపోయిన పేరు. ఒక విషాదకరమైన ఉదంతంతో ముడిపడి ఉన్న పేరు అది. పదుల సంఖ్యలో కుటుంబాలకు తీరని దుఖాన్ని మిగిల్చిన ఆ దుర్ఘటనే- గోదావరిలో రాయల్ వశిష్ట లాంచీ మునక. ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి నది గర్భంలో, బురదలో కూరుకుని పోయిన లాంచీని విజయవంతంగా వెలికి తీయగలిగారు ధర్మాడి సత్యం.
బాలాజీ మెరైన్స్ యజమానిగా..
కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం.. స్వతహాగా మత్స్యకారుల కుటుంబానికి చెందిన వారు. ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కాకినాడలో బాలాజీ మెరైన్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి నదిలో పర్యాటక లాంచీ రాయల్ వశిష్ట ప్రమాదానికి గురైన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో తెర మీదికి వచ్చారాయన.
నౌకాదళం వల్ల కానిది..
రాయల్ వశిష్ఠ లాంచీ కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో సుమారు 50 మందికి పైగా జలసమాధి అయ్యారు. వారిలో కొందరి మృతదేహాలు గల్లంతయ్యాయి. నదీ గర్భానికి చేరుకున్న లాంచీలో మృతదేహాలను చిక్కుకుని ఉండొచ్చని అనుమానించారు. యుద్ధ ప్రాతిపదికన దాన్ని వెలికి తీయాలని నిర్ణయించారు. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరులు ఉన్న నౌకాదళ సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను బరిలో దించారు.
ధర్మాడి మీదే అధికార యంత్రాంగం ఆధారం..
నదీ గర్భానికి చేరుకుని, లాంచీని గుర్తించి, దాన్ని వెలికి తీయడంలో నౌకాదళ సిబ్బంది గానీ, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు గానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ధర్మాడి సత్యం మీద ఆధారపడాల్సి వచ్చింది. రాయల్ వశిష్ఠ లాంచీని వెలికి తీసే పనుల కాంట్రాక్టును తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగం ఆయనకు అప్పగించింది. 22 లక్షల రూపాయలకు కాంట్రాక్టును పొందారు.
వ్యూహాలకు భిన్నంగా..
బాలాజీ మెరైన్స్ నిపుణులు, గజ ఈతగాళ్లను బరిలో దింపారు. లాంచీని వెలికి తీయడానికి పలు దఫాలుగా ప్రయత్నాలు కొనసాగించారు. లాంచీ మొత్తం బురదలో కూరుకునిపోవడంతో అనుకున్న సమయంలో దాన్ని వెలికి తీయడానికి ధర్మాడి సత్యం, అతని బృందం సభ్యులు చేసిన వ్యూహాలు కూడా బెడిసి కొట్టాయి. ఐరన్ రోప్, లంగర్ల సహాయంతో లాంచీ మునిగిన ప్రదేశాన్ని గుర్తించారు. లాంచీని ఇనుప తాళ్తో కట్టి ప్రొక్లెయిన్లతో బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి.
స్కూబా డైవర్ల సహాయం..
దీనితో ఆయన విశాఖపట్నానికి చెందిన స్కూబా డైవర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్కూబా డైవర్లను కచ్చులూరు తీసుకొచ్చి బోటు మునిగిన ప్రదేశం, అక్కడి లోతు, నదీ ఉధృతి మీద అవగాహన కల్పించారు. అనంతరం తన వ్యూహమేంటో వారికి వివరించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా స్కూబా డైవర్లు నదీ గర్భంలోకి దిగి ఇనుప తాళ్లతో లాంచీ మొత్తాన్నీ చుట్టేశారు. దాన్ని ప్రొక్లెయిన్ తో అనుసంధానించారు. ప్రొక్లెయిన్ తో బయటికి లాగడంతో లాంచీ బయటికి వచ్చింది.
సొంత వ్యూహాలు, అపార అనుభవం..
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో మెరైన్, నేవీ బృందాలు కూడా చేయలేని పనిని ధర్మాడి సత్యం సాధించడం ఆయనను సామాన్యుల్లో అసామాన్యుడిగా నిలిపింది. అధికార యంత్రాంగం తనపై ఉంచుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. తన శక్తికి మించిన పనిని సాధించగలిగారు. అధికారుల అంచనాలు కూడా తప్పలేదు. మునిగిన బోటులో నాలుగు మృతదేహాలు చిక్కుకుని కనిపించాయి.