రెండు ముక్కలైనా మనమంతా ఒక్కటే: ‘నాట్స్’పై బాలకృష్ణ ప్రశంసలు, ఫ్యాన్స్పైనా
లాస్ఏంజిల్స్: రాష్ట్రం రెండు ముక్కులుగా చీలిపోయిందని, అయినా తెలుగువారందరూ ఒక్కటిగా, కలిసి ఉంటారని ప్రముఖ సినీటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన అమెరికాలోని లాస్ఏంజిల్స్లో జరుగుతున్న నాట్స్(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు.
భాష, యాసలు వేరైనా మనమంతా ఒక్కటేనని ఎన్టీఆర్ చెప్పేవారని బాలకృష్ణ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి తెలుగు ప్రవాసాలు సహకరించాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏపి సిఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.
తాను హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆనందంగా ఉందని, గతంలో ఎన్టీఆర్ ఆ స్థానం నుంచే పోటీ చేశారని చెప్పారు. హిందూపురానికి రహదారి సౌకర్యం ఉందని, బెంగళూరుకు అతి సమీపంలో ఉందని చెప్పారు. అందువల్ల అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. నీటి కొరతను హంద్రీనీవా సుజల శ్రవంతి పథకం ద్వారా తీరుస్తామని చెప్పారు.
నాట్స్పై ప్రశంసలు
నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందని బాలకృష్ణ ప్రశంసించారు. భాషే రమ్యం-సేవే గమ్యం అనే నినాదంతో, నాట్స్.. మాటల్లోనే కాక చేతల్లో కార్యక్రమాలను చేసి చూపుతోందని అన్నారు. ఆపదలో ఉన్నవారికి నాట్స్ అండగా ఉంటోందని చెప్పారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వేస్తున్న అడుగులు అభినందనీయమని అన్నారు.
నాట్స్ తొలిసారి హెల్ప్ లైన్ పెట్టడం అభినందనీయమని, ఆ తర్వాతే అందరూ అనుసారించారని చెప్పారు. అవసరమున్నవారికి ఆర్థిక సాయం చేయడం, నాట్స్ డాక్టర్స్ లాంటి సేవలు అందిస్తోందని అన్నారు. న్యూజెర్సీలో అగ్నిప్రమాద సమయంలో బాధితులను నాట్స్ ఆదుకుందని చెప్పారు.
నాట్స్ 28 పట్టణాల్లో ఉచిత వైద్య సేవలందిస్తోందని బాలకృష్ణ తెలిపారు. తెనాలిలో 10వేల మందికి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. తన తరపున సాయం చేస్తానని, అండగా ఉంటానని బాలకృష్ణ చెప్పారు.
అభిమనులపై బాలకృష్ణ
తన అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువేనని బాలకృష్ణ అన్నారు. తాను ఏం చేసినా తన వెనకాలే ఉంటారని, ఇలాంటి అభిమానులు దొరకడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. గ్రామాల దత్తత లాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం హిందూపురం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
నాట్స్ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలపాటి రవి, మోహన కృష్ణ, రవి ఆచంట, మధు, ఆచారి, ప్రేమ్ సాగర్, పేరు పేరున అందరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా చేశారని ప్రశంసించారు. ప్రయాణం చేసిన అలసట మొత్తం ఈ కార్యక్రమాలతో పోయిందని అన్నారు.
అభిమానులకు ఎప్పుడు ఏదో కావానలే ఉంటుందని అన్నారు. ఇటీవల విడుదలైన లయన్ చూశారుగా అని అభిమానుద్దేశించి బాలకృష్ణ అన్నారు. చివరి శ్వాస ఉన్నంత వరకు నటుడిగా, బాధ్యతగల పౌరుడిగా కృషి చేస్తానని అన్నారు.