బాలయ్య గెలిచారు..ఇద్దరు అల్లుళ్లూ పరాజయం పాలయ్యారు!
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పట్లో కోలుకోలేనంతగా దారుణ పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. టీడీపీ తరఫున పోటీ చేసిన మహామహులు, హేమాహేమీలు ఫ్యాన్ గాలి ముందు నిలవలేక పోయారు. కంచుకోటలు కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటికి టీడీపీ సీనియర్లే కాదు.. జూనియర్లు కూడా తలవంచేశారు.
మామ విజయం
ఈ ఎన్నికల్లో- నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన ఇద్దరు అల్లుళ్లు పోటీ చేశారు. బాలకృష్ణ పెద్ద అల్లుడు, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, చిన్న అల్లుడు శ్రీభరత్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీ ఇద్దరికీ చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. నారా లోకేష్, శ్రీభరత్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ సీపీ ప్రభంజనంలోనూ మామను గెలిపించిన ఓటర్లు.. అల్లుళ్లను చిన్నచూపు చూశారు. మట్టి కరిపించారు.
లోకేశ్ ఓటమి
ఎమ్మెల్సీగా ఎన్నికై, తన తండ్రి కేబినెట్లో మంత్రిగా కొనసాగిన నారా లోకేష్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగారు. ఏరికోరి మరీ గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల బరిలో దిగారు. చంద్రబాబు కుమారుడిగా ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ.. ఆయన విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయారు. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు ఆరువేల ఓట్లకు పైగా తేడాతో నారా లోకేష్ ఘోరంగా ఓడిపోయారు.
శ్రీ భరత్ కూడా ..
విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కూడా తన తోడల్లుడి బాటలో నడిచారు. ఆయనా ఓడిపోయారు. భరత్పై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఘన విజయం సాధించారు. భారీ మెజారిటీతో బాలకృష్ణ చిన్నల్లుడిపై పైచేయి సాధించారు.