బాలకృష్ణ ఇక్కడ,జగన్ అక్కడ: హైద్రాబాద్పై మోదుగుల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పంజాగుట్ట సర్కిల్లోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి ఎపి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేత వైయస్ జగన్, ఆ పార్టీ సభ్యులు లోటస్ పాండు నుండి బస్సులో బయలుదరారు. పంజాగుట్ట సర్కిల్ వద్ద గల వైయస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరికొందరు సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి హాజరవుతున్నారు.
అంతకుముందు ఆయన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, దూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమ తదితరులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు, ఇతర టిడిపి ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరారు. కాగా, బాలకృష్ణ, జగన్.. ఇద్దరు అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇదే తొలిసారి.
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మరో మంత్రి కామినేని శ్రీనివాస రావు కూడా బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాదుపై మాకు హక్కు: మోదుగుల
ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పైన గురువారం మండిపడ్డారు. తమకు విద్యుత్ ఇవ్వమని హరీష్ రావు హెచ్చరించడం సరికాదన్నారు. హైదరాబాదు పైన తమకు కూడా హక్కు ఉందన్నారు.