టైం కాదు, మీ ప్రాబ్లం: నంది వివాదంపై బాలకృష్ణ, బ్రాహ్మణి, జగపతి బాబులు ఇలా
నంది అవార్డుల వివాదంపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఫేస్బుక్ - ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు.
అమరావతి/హైదరాబాద్: నంది అవార్డుల వివాదంపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఫేస్బుక్ - ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు.
Recommended Video
లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు రావడం సంతోషకరమన్నారు. నంది అవార్డుల విషయంలో ఎలాంటి వివాదాలు వద్దన్నారు. సమష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజయవంతమైందన్నారు. అందరూ కష్టపడ్డారు కాబట్టే తాను నటించిన సినిమాకు తొమ్మిది అవార్డులు వచ్చాయన్నారు.
మాటలతో కాదు చేతలతో చూపిన సినిమా
మాటలతో కాదు చేతలతో చూపించిన సినిమా లెజెండ్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నంది అవార్డులు ఎంపిక చేసిన వారికి కృతజ్ఞతలు అన్నారు. సాధించిన వారందరికీ అభినందనలు తెలిపారు. లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదన్నారు. అనంతరం వివాదంపై ప్రశ్నించగా ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు.
అది మీ సమస్య, నాది కాదు
నంది రావడం పట్ల నటుడు జగపతి బాబు కూడా ఆనందం వ్యక్తం చేశారు. నంది అవార్డులపై వివాదాలు రావడంపై జర్నలిస్టులు ప్రశ్నించగా... అది మీ ప్రాబ్లమండీ, నాది కాదు అని నవ్వుతూ వెళ్లిపోయారు.
ఇది టైం కాదని బ్రాహ్మణి
మరోవైపు, బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి నంది అవార్డుపై స్పందించారు. లెజెండ్ మూవీకి నాన్న గారికి ఉత్తమ నటుడి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. నంది అవార్డుల వివాదంపై ప్రశ్నించగా.. దానిపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని బ్రాహ్మణి అన్నారు.
మూడేళ్లకు నంది అవార్డులు
కాగా, నంది అవార్డులపై వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం మూడేళ్లకు నంది అవార్డులు ప్రకటించింది. మూడేళ్లకు వేర్వేరుగా జ్యూరీని నియమించి, ఎంట్రీలను ఆహ్వానించింది. వచ్చిన ఎంట్రీలను పరిశీలించి అవార్డులు ప్రకటించింది.
వివాదం కొనసాగుతోంది
ఈ జ్యూరీలో నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్లతో పాటు ప్రముఖులు ఉన్నారు. అవార్డులు ఇచ్చారా, పంచారా అనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిసారి అవార్డుపై అసంతృప్తి, వివాదం కనిపిస్తుంది. కానీ ఈసారి అది ఎక్కువ ఉంది. బన్ని వాసు, బండ్ల గణేష్, నల్లమలుపు శ్రీనివాస్, గుణశేఖర్ లాంటి వారు విమర్శలు గుప్పించారు.