సీమకు నికర జలాలు కేటాయించాలి -ఢిల్లీలో హర్యానా తరహా ఉద్యమం : బాలకృష్ణ హెచ్చరిక..!!
టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రాయలసీమకు కృష్ణాజలాలపై పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కృష్ణా రివర్ వ్యవహారాలు బోర్డు పరిధిలోకి వెళ్లిపోవడంతో సీమకు నీళ్లు వచ్చే అంశంపై పోరాటం చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సీమకు కృష్ణా జలాలు, హక్కులు, డిమాండ్ల పేరుతో ఈరోజు హిందూపూర్లో ఎమ్మెల్యే బాలకృష్ణ రౌంట్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 8 పార్లమెంట్ నియోజక వర్గాలకు చెందిన టీడీపీ నేతలతో బాలయ్య సమావేశం అయ్యారు.
నికర జలాలు కేటాయించాలంటూ
కృష్ణా జలాల విషయంలో ఎలాంటి పోరాటం చేయాలి అనే అంశంపై చర్చించారు. కృష్ణ జలాల పరిరక్షణే ధ్యేయంగా సాగిన ఈ సదస్సులో చర్చ జరిగింది. నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు-రాయలసీమ హక్కుల సాధన మీదే ప్రధానంగా చర్చసాగింది. ఈ సదస్సులో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. రాయలసీమకు కావాల్సింది మిగులు జలాలు కాదని.. నికర జలాలు కేటాయించాలని బాలయ్య డిమాండ్ చేసారు. గతంలో చేపట్టిన గోదావరి -పెన్నా నదుల అనుసంధానం జరగాలని ఆయన కోరారు.
ఢిల్లీలో హర్యానా తరహా ఉద్యమం
మన హక్కులను కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారన్నారు. అవసరమైతే సీమ నీటి ప్రయోజనాల కోసం ఢిల్లీలో హర్యానా తరహాలో ఉద్యమాన్ని తీసుకొని రావాలి. రాయలసీమ ఒక్కప్పుడు రతనాల సీమ.. కానీ నిర్లక్ష్యం కి గురై ఈ పరిస్థితి వచ్చిందని బాలయ్య వ్యాఖ్యానించారు. రాయలసీమ పరిస్థితి చూసి హంద్రీనీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలె పెట్టారు. తెలుగు గంగ ద్వారా కొంత వరకు సస్యశ్యామలం చేశారు. నీరు సమృద్ధిగా ఉన్నా హంద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వలేకపోయారని చెప్పుకొచ్చారు.
Recommended Video
వైసీపీ చేసింది ఏమీ లేదు
1400 చెరువులు ఉంటే కేవలం 130 చెరువులకు మాత్రమే నీరు ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి నీరు ఇవ్వాలని లేదు.. ఎవర్నీ సంప్రదించరు. కరవు మండలాలకు నీరు వచ్చేలా స్కీం లు పూర్తి చేయాలని బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రభుత్వానికి నీరు ఎలా ఇవ్వాలనే ఆలోచన లేదన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హంద్రీనీవా పథకాన్ని తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దనీ, పథకానికి 2014నుంచి 2019 టీడీపీ హ యాంలోనే రూ.4వేల కోట్ల ఖర్చు పెట్టి చంద్రబాబు కృషితో జిల్లాకు కృష్ణాజలాలు వచ్చాయని సీమ తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హంద్రీనీవా రాకతో జిల్లా వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడిందని.. జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో హంద్రీనీవాపై నయా పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శిస్తున్నారు.