సత్తా చూపాలి: జగన్ పార్టీ, కేంద్రంపై మరోసారి బాలకృష్ణ ఫైర్, మహిళలతో కలిసి చిందేశారు
అనంతపురం: రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసిన మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లా చిలమత్తూరులో శుక్రవారం 'పల్లెబాట' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాయమాటలు చెప్పి..
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోగా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాయమాటలు చెప్పిందని కేంద్రంపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉన్నా ఫలితం లేకపోవటంతో బయటకు రావాల్సి వచ్చిందన్నారు.
Recommended Video
బుద్ధి చెప్పాలి
కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి సత్తా చూపామని బాలకృష్ణ చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ తెలుగువారు తమకు జరిగిన అన్యాయానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని బాలయ్య పిలుపునిచ్చారు.
పరోక్షంగా జగన్ పార్టీపై విమర్శలు
రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రాజీనామాల డ్రామాలు అడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలనుద్దేశించి బాలకృష్ణ ఆరోపించారు. మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనకపోగా, రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నిందిస్తున్నారని ధ్వజమెత్తారు.
సమస్యలు వింటూ.. మహిళలతో కలిసి నృత్యం
అనంతరం ఆదేపల్లితండాలో లంబాడీ మహిళలతో కలిసి బాలకృష్ణ నృత్యం చేశారు. స్థానికంగా జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు.
హిందూపురంలో బాలకృష్ణ గత మూడు రోజుల నుంచి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉత్సాహంగా తన పర్యటనను కొనసాగించారు బాలకృష్ణ.