బాలకృష్ణ రోడ్ షోలో అపశృతి: బాలుడ్ని ఢీకొన్న కాన్వాయ్ వాహనం
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. కాగా, బుధవారం బాలకృష్ణ రోడ్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే అపశృతి చోటు చేసుకుంది.
ఓటు తూటాతో జగన్ పార్టీకి బుద్ధి చెప్పండి: శిల్పాపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు
అపశృతి
బాలయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఓ వాహనం ఓ బాలుడిని ఢీకొట్టింది. దీంతో గాయపడ్డ బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడు స్వల్పంగా గాయపడ్డాడని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రమాదమేమీ లేదని చెప్పారు.
Recommended Video
కొనసాగిన రోడ్ షో
ఆ తర్వాత, బాలకృష్ణ తన ప్రచారాన్ని కొనసాగించారు. ‘నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో.. ఆయన అభిమానులంతా ముందుకొచ్చి పార్టీని నడిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపర్చాలి'అని బాలకృష్ణ కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు.
అభివృద్ధికి అడ్డుగా వైసీపీ..
నంద్యాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతులకు రుణాల నుంచి విముక్తి కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే అన్ని పనులను అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని బాలకృష్ణ విమర్శించారు. ప్రజలకు మంచి చేసే పనులపై సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాన్ని విమర్శించడమే విపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు.
ఎప్పుడొచ్చినా భూమా ఇంట్లోనే బస..
తాను ఎప్పుడు సినిమా షూటింగ్స్ కోసం వచ్చినా.. భూమా కుటుంబం ఇల్లు ఇచ్చేవారని, భూమా కూతురు అఖిలప్రియ పర్యాటకశాఖ మంత్రి కావడం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు. బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను ఆయన కోరారు.