బాలకృష్ణ పుష్కర స్నానం: ఏర్పాట్లపై సంతృప్తి, రాజరాజనరేంద్రుడికి బాబు నివాళి
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. కోట్లాది మంది పుష్కరస్నానాలు చేశారని ఆయన అన్నారు.
శనివారం బాలకృష్ణ రాజమండ్రిలోని సరస్వతి ఘాట్లో పుష్కరస్నానం చేశారు. గోదావరి పుష్కరాల చివరి రోజున వీఐపీ ఘాట్లో బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. కోట్లాది మంది భక్తులు పుష్కరస్నానాలు చేశారని బాలకృష్ణ తెలిపారు.
ఇదిలావుంటే, రాజమండ్రిలోని రాజరాజనరేంద్రుడి విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది పాటు పుష్కరుడు గోదావరిలో ఉంటాడని అందువల్ల భక్తులు ఎప్పుడైనా పుణ్యస్నానాలు ఆచరించవచ్చని చంద్రబాబు తెలిపారు.
ఏడాది తర్వాత జరిగే ముగింపు పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. గోదావరి హారతి శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. గోదావరి తల్లికి రుణం తీర్చుకునేందుకు ఇంటింటా పుష్కర దీపారాదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
పుష్కరాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్ట్స్ కాలేజీలో గోదావరి పుష్కర ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.